సమాజ వికాసానికి విద్య దోహదపడాలి
● ఓయూ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు ● ముగిసిన పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు
ఖమ్మంమయూరిసెంటర్ : దేశంలో కుల, మత, ఆర్థిక తారతమ్య భేదాలు లేకుండా మానవ సమాజ వికాసానికి విలువైన వనరుగా విద్య ఉపయోగపడాలని, అలాంటి విద్య సోషలిస్టు సమాజంలోనే సాధ్యమని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగియగా, చివరి రోజున ‘విద్యారంగం సంక్షోభం’ అనే అంశాన్ని నాగేశ్వరరావు బోధించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువుతోనే ప్రశ్నించే తత్వం, మానవీయ నైతిక విలువలు పెరుగుతాయన్నారు. విద్యార్థుల విజ్ఞానం సమాజ అవసరాలు నెరవేర్చేదిగా ఉండాలని ఆకాంక్షించారు. విద్యారంగంపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా సామాజిక, ఆర్థిక అసమానతలు నానాటికీ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో నెలకొంటున్న సమస్యల పరిష్కారానికి విద్యార్థులు సరైన దృక్పథం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ‘జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు – విద్యార్థుల కర్తవ్యాలు’ అనే అంశాన్ని సామాజిక వేత్త డి.పాపారావు బోధించారు. అనంతరం పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. ప్రణాళిక –నిబంధనావళిని రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహారావు ప్రవేశపెట్టగా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ, ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, ఎం.నరేందర్, ఎస్.రాకేష్, సహాయ కార్యదర్శులు ఎం.సాయి, గణేష్, జి.సురేష్, వి.వెంకటేష్, నాయకులు బి.అజయ్, అలవాల నరేష్, టి.లక్ష్మణ్, ఎల్.అనిల్, అంగిడి కుమార్, మునిగేల శివప్రసాద్, అషూర్, వి.కావ్య, దీక్షిత, గుమ్మడి చైతన్య, పి.అనూష, సీతారాం, మధు, అశోక్ పాల్గొన్నారు.


