జగనన్న సైనికులు అధైర్యపడొద్దు
● వైఎస్సార్ కుటుంబం అండగా ఉంటుంది ● ఖమ్మంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానులకు ఆరె శ్యామల భరోసా
ఖమ్మంమయూరిసెంటర్ : వైఎస్ జగన్మోహన్రెడ్డి పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నందుకు అక్రమ కేసులు పెట్టి వేధిస్తే భయపడేది లేదని, జగనన్న సైనికులు ఎవరూ అధైర్యపడొద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల అన్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించినందుకు అక్రమ కేసులకు గురై, ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభిమానులను ఆదివారం ఆమె ఖమ్మంలో పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖమ్మంలో జగన్ పుట్టినరోజు వేడుకల్లో వేలాది మంది అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొన్నారని, అభిమానం చాటుకున్నందుకు వారిపై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టి రిమాండ్కు పంపడం దుర్మార్గమని అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడం వైఎస్సార్ కుటుంబానికి అలవాటని, అక్రమ కేసులతో ఇబ్బంది పడుతున్న వైఎస్సార్ అభిమానులకు ఆ కుటుంబం అండగా ఉంటుందని చెప్పారు. చెప్పింది చేసిచూపే నాయకుడు జగన్ అని, ఆయన వెంట నడుస్తున్నందుకు గర్వపడాలని అన్నారు. ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో జగనన్నపై ఉన్న అభిమానాన్ని చెరిపేయలేరని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ అభిమానులు గంగరబోయిన రవి, యర్రా నాగరాజు రెడ్డి, మర్రి శ్రీనివాస్, ఆలస్యం సుధాకర్, సరికొండ రామరాజు, గణపారపు మురళి, పగిళ్ల నరేష్, శివారెడ్డిని శ్యామల పరామర్శించగా, కార్యక్రమంలో ఆలస్యం రవి, కన్నెబోయిన సీతరామయ్య, బోనగిరి వెంకటరమణ, ఆదూరి రాజవర్ధన్రెడ్డి, వాలూరి సత్యనారాయణ, ఆలస్యం నర్సయ్య, కంబం నవీన్, బూరగడ్డ లక్ష్మీనారాయణ, కాకుమాని నర్సింహారెడ్డి, వాకా లక్ష్మారెడ్డి, గూడూరు వెంకటేష్ పాల్గొన్నారు.


