
ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యం
రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా మధిరను తీర్చిదిద్దుతా...
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఎర్రుపాలెం: మారుమూల గ్రామాల్లోని ప్రజల అవసరాలు తీరుస్తూ, మౌలిక వసతులు కల్పించి జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో భట్టి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే 50ఏళ్లకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాలు చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. తద్వారా రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మధిరను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈకార్యక్రమాల్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం సుడిగాలి పర్యటన
ఎర్రుపాలెం మండలంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని అయ్యవారిగూడెం, ఎర్రుపాలెం, పెద్దగోపవరం, బనిగండ్లపాడు బుచ్చిరెడ్డిపాలెం గ్రామాల్లో రూ.4 కోట్ల ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో నిర్మించే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. పెద్దగోపవరం, భీమవరంలో రూ.12 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపన చేశారు. బనిగండ్లపాడులో భోజన విరామం అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పీఆర్ ఎస్ఈ వెంకటరెడ్డి, డీపీఓ ఆశాలత, ఆర్అండ్బీ ఎస్ఈ యాకూబ్, విద్యుత్ ఎస్ఈ శ్రీనివాసాచారి, తహసీల్దార్ ఉషాశారదతో అభివృధ్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. ఇక బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలోని ఇనద్రమ్మ చెరువును కలెక్టర్ అనుదీప్, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్లతో కలిసి డిప్యూటీ సీఎం పరిశీలించారు. అక్కడకు వెళ్లే రహదారి ఇటీవల వర్షాలతో బురదమయంగా మారడంతో ట్రాక్టర్పై వెళ్లారు. ఇనద్రమ్మ చెరువును పర్యాటకంగా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆతర్వాత జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్లను ఈఓ జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మతో కలిసి భట్టి ఆవిష్కరించారు. ఈకార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, నాయకులు యరమల పూర్ణచంద్రారెడ్డి, అనుమోలు కృష్ణారావు, తల్లపురెడ్డి నాగిరెడ్డి, మల్లెల లక్ష్మణరావు, శీలం వెంకట్రామిరెడ్డి, షేక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యం