రూ.350 కోట్లతో ప్రతిపాదనలు | - | Sakshi
Sakshi News home page

రూ.350 కోట్లతో ప్రతిపాదనలు

Sep 6 2025 5:33 AM | Updated on Sep 6 2025 5:33 AM

రూ.35

రూ.350 కోట్లతో ప్రతిపాదనలు

విడతల వారీగా బడ్జెట్‌ కేటాయించాలని నివేదిక

రామాలయ కొత్త మాస్టర్‌ ప్లాన్‌పై వైదిక కమిటీ కినుక..?

భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ రూ.350 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ మేరకు ఆర్కిటెక్ట్‌ సూర్యనారాయణ మూర్తి, దేవాదాయ శాఖ ఉన్నతాఽధికారులు ప్రాథమిక నమూనా సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో కలెక్టర్‌ ఆలయ అధికారులతోపాటు వైదిక కమిటీ సభ్యులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అభ్యంతరాలు, సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉంటుందని, ప్రధాన ఆలయంలో మార్పులు లేకుండా ఇతర అభివృద్ధి పనులు చేపతామని పేర్కొన్నారు.

నాలుగు విడతలుగా..

రామాలయం, పరిసర ప్రాంతాల అభివృద్ధి నాలుగు విడతల్లో చేపట్టేలా నూతన నమూనాలో ప్రతిపాదనలు రూపొందించారు. తొలి విడతలో ఆలయ కాంప్లెక్స్‌ విస్తరణ పూర్తి చేయాలని ప్రతిపాదించారు. మండపాలు, క్యూ హాళ్లు, ప్రసాదం విభాగం, అడ్మినిస్ట్రేషన్‌ భవనాలు ఉన్నాయి. ఇందుకు రూ. 115 కోట్లు అవసరమని సూచించారు. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల అభివృద్ధిని రెండో విడతలో ప్రాధాన్యాంశాలుగా పేర్కొన్నారు. ఇందులో విస్తా కాంప్లెక్స్‌, అడ్మిన్‌ బ్లాక్‌, ఘాట్లు, రహదారులు ఉన్నాయి. ఈ పనులను రూ.35 కోట్లతో ప్రతిపాదించారు. మూడో విడతలో కరకట్టకు దిగువ భాగాన ఉన్న కాపా రామలక్ష్మమ్మ భూమిని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఇది గతంలో ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఉండగా, సుదీర్ఘ కాలం కోర్టులో వాదనల అనంతరం రామాలయ సొంతమైంది. ఇందులో రామాయణ మ్యూజియం, తూము నర్సింహాదాసు ఆడిటోరియం, భక్త రామదాసు ప్లాజా, మల్టీ లెవల్‌ పార్కులు నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. ఇందుకు రూ.100 కోట్లతో ప్రతిపాదించారు. ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి పనులకు నాలుగో విడతలో ప్రతిపాదించారు. హోటళ్లు, గిరిజన మ్యూజియం, రామవనం, పట్టణ సుందరీకరణ పనుల చేపట్టేలా పొందుపర్చారు. ఇందుకోసం రూ.100 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఇలా మొత్తం రూ.350 కోట్లతో ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీన్ని సర్కారు ఆమోదించి తగిన బడ్జెట్‌ విడుదల చేయాల్సి ఉంది.

వైదిక కమిటీ అసంతృప్తి..?

కొత్త మాస్టర్‌ ప్లాన్‌పై ఆలయ వైదిక కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్కిటెక్ట్‌ సూర్యనారాయణ మూర్తి తమను సంప్రదించకుండానే ప్లాన్‌ రూపొందించటంపై కినుక వహించినట్లు తెలుస్తోంది. గతంలో చినజీయర్‌ స్వామి సూచనతో ఆనంద సాయి రూపొందించిన ప్లాన్‌ను వీరు ఆమోదించారు. అయితే ప్రస్తుత ప్లాన్‌పై వీరు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం పర్యటన సమయంలో మాత్రం వైదిక కమిటీ సలహాలు, సూచనలను తప్పకుండా తీసుకోవాలని, వారి ఆమోదం తర్వాతే ప్లాన్‌ను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే వైదిక కమిటీ, పండితులు, దేవాదాయ శాఖ అధికారులు సమష్టిగా ఈ ప్రణాళికను అమోదిస్తేనే ఆలయాభివృద్ధి కల సాకారం కానుంది. లేనిపక్షంలో ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశమే ఉండదు.

భద్రాచలం రామాలయ అభివృద్ధికి ప్రణాళిక

రూ.350 కోట్లతో ప్రతిపాదనలు1
1/1

రూ.350 కోట్లతో ప్రతిపాదనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement