
రాష్ట్రంలోనే మోడల్గా ఇంటిగ్రేటెడ్ పాఠశాల
● లక్ష్మీపురం పాఠశాల పనులు త్వరగా పూర్తి చేయాలి ● పనుల పరిశీలనలో కలెక్టర్ అనుదీప్
బోనకల్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తుండగా.. రాష్ట్రంలోనే మోడల్గా గుర్తింపు వచ్చేలా లక్ష్మీపురం పాఠశాల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. బోనకల్ మండలం లక్ష్మీపురంలో 25 ఎకరాల్లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ పనులను గురువారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీజతో కలిసి తనిఖీ చేశారు. మ్యాప్ ఆధారంగా వివరాలు పరిశీలిస్తూ సూచనలు చేశారు. నిర్మాణంలో నాణ్యత పాటిస్తూ వచ్చే విద్యాసంవత్సరం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులు జె.బుగ్గయ్య, బి.నాగేశ్వరరావు, సురేష్, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ రమాదేవి, ఎంఈఓ దామాల పుల్లయ్య, కాంట్రాక్టర్ ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా పాడి పశువుల కొనుగోలు
మధిర: ఇందిరా మహిళా డెయిరీ లబ్ధిదారులకు పాడి పశువుల కొనుగోలు పారదర్శకంగా జరగాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. మధిర మున్సిపల్ కార్యాలయంలో పాడి పశువుల కొనుగోలుకు ఎంపిక చేసిన అధికారులు, బృందాలతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ 20వేల మంది లబ్ధిదారులకు రెండు పశువుల చొప్పున 40వేల పాడి పశువులు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం ఆరుగురు చొప్పున పది బృందాలను ఏర్పాటుచేసినందున ఈ నెల 6న మొదటి విడతగా వెళ్లాలని తెలిపారు. కొనుగోళ్లు, బీమా, ఇతరత్రా అంశాల్లో లబ్ధిదారుల సూచనలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎక్కడ పొరపాటు జరిగినా బాధ్యులపై కఠినమైన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. అదనపు కలెక్టర్ శ్రీజ, డీఆర్డీఓ ఎన్.సన్యాసయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్బాబు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ విజయలక్ష్మి, తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ పాల్గొన్నారు.
రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా మార్కెట్
ఖమ్మంవ్యవసాయం: రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా మిర్చి మార్కెట్ నిర్మాణాలు ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రూ.155.30 కోట్లతో ఖమ్మం మార్కెట్లో జరుగుతున్న మోడల్ మిర్చి మార్కెట్ నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ శ్రీజ, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. షెడ్లు, ఆర్ ఓ ప్లాంట్లు, టాయిలెట్లు, ల్యాబ్ నిర్మాణాలపై ఆరా తీస్తూ తేమ, రంగు పరీక్ష యంత్రాల ఏర్పాటు, డిజిటలైజేషన్పై సూచనలు చేశారు. అలాగే, హెల్త్ సెంటర్, క్యాంటీన్ ఏర్పాటు చేస్తూ రానున్న సీజన్ కల్లా అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్లు యరగర్ల హనుమంతరావు, తల్లాడ రమేష్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి అలీం, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోనే మోడల్గా ఇంటిగ్రేటెడ్ పాఠశాల