
ఒకరి రక్తదానంతో ముగ్గురికి ప్రాణం
ఖమ్మంవైద్యవిభాగం/ఖమ్మం మామిళ్లగూడెం: ఓ వ్యక్తి రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న ముగ్గురి ప్రాణాలను కాపాడొచ్చని డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయి తెలిపారు. ముస్తఫానగర్ పీహచ్సీ వద్ద వికాస తరంగిణి, రెడ్క్రాస్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని మేయర్ పి.నీరజతో కలిసి డీఎంహెచ్ఓ ప్రారంభించి మాట్లాడారు. అన్నిదానాల్లోకెల్లా రక్తదానం విలువైనదని గుర్తించి ఆరోగ్యవంతులైన వారు ముందుకు రావాలని కోరారు. ముస్తఫానగర్ మెడికల్ ఆఫీసర్ రమేష్, ఉద్యోగులు చామంతి, ప్రసాద్, శైలజ కూడా రక్తదానం చేయగా 38యూనిట్ల రక్తం సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. వికాస తరంగిణి చైర్మన్ పోలా శ్రీనివాస్, రెడ్క్రాస్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమోహన్, సూర్యప్రకాశ్, ఉద్యోగులు సత్యనారాయణ, ఖాదర్బీ, వీరబాబు, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ డీఎంల బదిలీ
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీలో పలువురు డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ యాజమాన్యం గురువారం ఉత్తుర్వులు జారీ చేసింది. జాబితాలో ఖమ్మం రీజియన్లోని ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం మేనేజర్లు ఉన్నారు. ఖమ్మం డిపో మేనేజర్ దినేష్కుమార్ కామారెడ్డి డీఎంగా, మహబూబాబాద్ డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ ఖమ్మం డీఎంగా, సత్తుపల్లి డీఎం యూ.రాజ్యలక్ష్మి కొత్తగూడెం డీఎంగా, నల్లగొండ డిపో సీఐ వి.సునీత పదోన్నతిపై సత్తుపల్లి డీఎంగా బదిలీ అయ్యారు. అలాగే, కొత్తగూడెం డీఎం ఎం.దేవేందర్ గౌడ్ను వనపర్తికి, భద్రాచలం డిపో మేనేజర్ బి.తిరుపతి హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో లా విభాగానికి బదిలీ కాగా, మహబూబ్నగర్ డిపో అసిస్టెంట్ మేనేజర్(మెకానికల్) పి.జంగయ్య పదోన్నతిపై భద్రాచలం డీఎంగా రానున్నారు.
కార్యదర్శుల బదిలీలపై స్టే
ఖమ్మంవ్యవసాయం: పీఏసీఎస్ల కార్యదర్శుల బదిలీపై హైకోర్టు స్టే ఇచ్చింది. బదిలీలపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగించాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డీసీసీబీల పరిధిలో కార్యదర్శులను బదిలీ చేయగా, ఖమ్మం డీసీసీబీ పరిధిలో 69మందికి స్థానచలనం కల్పించారు. దీనిపై వివిధ జిల్లాల వారితో పాటే ఖమ్మం కార్యదర్శులు 35మంది కోర్టును ఆశ్రయించగా స్టే వచ్చింది. ఫలితంగా మొత్తం ప్రక్రియ ఆగిపోయినట్లేనని భావిస్తున్నారు. ఈ అంశంపై డీసీసీబీ సీఈఓ వెంకట ఆదిత్యను కలిసి బదిలీల్లో మార్పు చేయాలని కోరారు. అయితే, కేసు విరమించుకుంటే పునః పరిశీలనకు అవకాశముందని తెలుస్తోంది.
డ్రెయినేజీ నెట్వర్క్కు రూ.110కోట్లు
రఘునాథపాలెం: జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న రఘునాథపాలెం మండలంలోని గిరిజన తండాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచేందుకు సమగ్ర సిమెంట్ కాంక్రీట్ డ్రెయినేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రూ.110 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ రూపొందించినందున నిధులు కేటాయించాలని ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కు గురువారం ఢిల్లీలో వినతిపత్రం అందజేశారు. నిధులు కేటాయిస్తే 37 ఆవాసాలు, తండాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడతాయని, మురుగునీరు మున్నేరులో నేరుగా కలవకుండా శుద్ధి కోసం ప్లాంట్ ఏర్పాటుచేయొచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ద్వారా నిధులు కేటాయించాలని తుమ్మల ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
కమనీయం.. కల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి నిత్యకల్యాణ వేడుక గురువారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడామండపంలో స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణ ధారణ, యోక్తధ్రారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు నిర్వహించారు.