
వేతనాలు వచ్చేదెప్పుడో..?
● కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఎదురుచూపులు ● నాలుగు నెలలుగా జీతం అందక ఇక్కట్లు ● సర్వీస్ పునరుద్ధరణపైనా నీలినీడలు
ఖమ్మంసహకారనగర్: 2008లో వారంతా డీఎస్సీ అర్హత సాధించారు. రకరకాల కారణాలతో పోస్టింగ్ ఇవ్వడం ఆలస్యం జరగగా, సుమారు 16 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కానీ, కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియామకాలు చేపట్టారు. అయినా సరే, ప్రభుత్వం నుంచి అందే వేతనాలు కావడంతో జీవనానికి భరోసా ఉంటుందని భావించారు. దీంతో అప్పటివరకు చేస్తున్న ఉద్యోగాలు మాని ఉపాధ్యాయులుగా చేరారు. కానీ, ఒకటి కాదు రెండు కాదు.. నాలుగు నెలలైనా వచ్చే అరకొర వేతనం కూడా చెల్లించకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అన్నింటికీ సర్దుకుపోతున్నా తమకు అందాల్సిన వేతనాల్లో జాప్యం చేయడంపై కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.
34 మంది
జిల్లాలో 2008 డీఎస్సీ అభ్యర్థులు 34 మందిని ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన విధుల్లోకి తీసుకున్నారు. వీరిని జిల్లాలోని వివిధ పాఠశాలలకు కేటాయించగా పాఠాలు బోధిస్తున్నారు. నాలుగు నెలల పాటు ఉంటున్న ప్రాంతం నుంచి పాఠశాలలకు వెళ్లి వచ్చినా నెలనెలా వేతనాలు మాత్రం రావడం లేదు. ఇదంతా పక్కన పెడితే విద్యాసంవత్సరం చివరిలో ఆయా ఉపాధ్యాయులను టెర్మినేట్ చేసిన విద్యాశాఖ.. వేతనాల జారీలో మాత్రం జాప్యం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అయితే, వేతనాల విషయమై స్పష్టత ఇవ్వలేకపోతున్నప్పటికీ.. మళ్లీ పాఠశాలలు తెరవగానే వారిని విధుల్లోకి తీసుకునే అవకాశముందని చెబుతుండడంతో కొంత మేర ఊరట కలిగిస్తోంది.

వేతనాలు వచ్చేదెప్పుడో..?