శివాజీనగర: తీరప్రాంత జిల్లాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ నేతృత్వంలో శుక్రవారం మంగళూరు నగరంలో మంత్రిమండలి సమావేశం జరగనుంది. తీరప్రాంతం, ఓడరేవులు, మత్స్య సంపద, ఈ జిల్లాల్లో అభివృద్ధి పథకాలు, పారిశ్రామిక రంగాలకు చేయూత వంటి అంశాలపై చర్చిస్తారు. మంగళూరు ప్రాంతంలో ప్రజలు విస్తృతంగా మాట్లాడే తుళు భాషకు రెండవ అదనపు రాష్ట్ర భాష హోదా కల్పించాలనే డిమాండు చర్చకు వచ్చే అవకాశముంది.
సీఆర్జెడ్కు సవరణలపై ఆశ
పలు పథకాలకు ఆటంకంగా ఉన్న తీర నియంత్రణ మండలం (సీఆర్జెడ్) కఠిన నిబంధనలను సడలించాలనే డిమాండ్లు ఉన్నాయి. సీఆర్జెడ్ ప్రకారం, సముద్ర తీరానికి 500 మీటర్ల పరిధిలో ఎలాంటి వంతెనలు, కట్టడాలు నిర్మించరాదు. దీనిని సవరించే ఆస్కారముంది. జిల్లా ఇన్చార్జి మంత్రి యూ.టీ.ఖాదర్ నేతృత్వంలో ఏర్పాట్లు జరిగాయి. తన్నీరుబావి బీచ్లో ఆకర్షణీయంగా ఆతిథ్య మండపాన్ని నిర్మిస్తున్నారు. తుళునాడు సంస్కృతిని చాటేలా స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంత వంటకాలను సీఎం, మంత్రులకు వడ్డిస్తారు. ఇప్పటికే మంత్రులు జిల్లాకు చేరుకున్నారు. శనివారం ఉదయం వరకూ మంగళూరులో బస చేస్తుండడంతో గట్టి బందోబస్తు ఏర్పాటవుతోంది.
నేడు మంగళూరులో కేబినెట్ భేటీ
సీఎం, మంత్రుల కోసం ఘనంగా ఏర్పాట్లు


