● సిద్దరామయ్య నిర్వేదం
శివాజీనగర: తాను ఇప్పుడు ముఖ్యమంత్రిని కానని, తన మాటలను ఎవరు పాటిస్తున్నారో తెలియదని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. గురువారం విధానసౌధలో పార్టీ ఆఫీసులో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ నేతలు సుర్జేవాలా తదితరులతో విడిగా సమావేశమైన తరువాత సిద్దరామయ్య ఇలా చెప్పడం చర్చనీయాంశమైంది. ప్రస్తుత ప్రభుత్వంలో తన మాట చాలా పరిమితమనే నిజాన్ని పరోక్షంగా బయటపెట్టారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా రాజ్యాంగ ప్రాథమిక ఆకాంక్షలు పూర్తిగా అమలు కాలేదన్నారు. సమాజంలో పాతుకుపోయిన కుల అసమానతలను నిర్మూలించడానికి శూద్ర, అణగారిన వర్గాలు మేల్కొని సంఘటిత పోరాటం చేయాలని సూచించారు.
అజ్ఞాతం వీడిన శాంత
● కేపీఎస్సీ స్కాంలో సీఐడీ
విచారణకు హాజరు
బనశంకరి: కేపీఎస్సీ పశువైద్యాధికారుల ఉద్యోగాల కుంభకోణంలో ఆ సంస్థ సభ్యురాలు శాంతా హొసమని ఎట్టకేలకు సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు ఇదివరకే తిరస్కరించింది. ఈ స్కాం వెలుగులోకి వచ్చిన వెంటనే శాంత హొసమని అదృశ్యమైంది. ఆమె కోసం సీఐడీ అధికారులు కర్ణాటకతో పాటు బయటి రాష్ట్రాల్లో తీవ్రంగా గాలించారు. మమిత అనే అభ్యర్థినితో ఆమె 3 సార్లు ఫోన్లో ఉద్యోగం గురించి మాట్లాడింది. 2023లో ఏఈఈ నియామకాల స్కాంలో కూడా ఆమె పేరు బయటకు వచ్చింది.
ఈడీ అధికారులు ఆగస్టు 18వ తేదీ కేపీఎస్సీ మాజీ అధ్యక్షుడు శివశంకరప్ప సాహుకార్తో పాటు శాంత ఇళ్లలో సోదాలు చేశారు. మళ్లీ కొన్నిరోజులకు సీఐడీ అధికారులు శాంత నివాసంలో సోదాలు చేసి అనేక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఈడీ దాడికి ముందే పరారైంది. సీడీఐ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఈ కేసులో ఐఏఎస్ జ్ఞానేంద్రకుమార్, బ్రోకరు బసవరాజు కన్నాళెను అరెస్టు చేయడం తెలిసిందే. ఆమె విచారణలో మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశముంది.
నేటి నుంచి క్వారీ,
క్రషర్ల సమ్మె
శివాజీనగర: తవ్వకాలపై ఇరు పక్షాల నుంచి రాయల్టీలు వసూలు చేసే పద్ధతిని నిలిపివేయడంతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ, కర్ణాటక రాష్ట్ర క్వారీ– స్టోన్ క్రషర్ యజమానుల సంఘం శుక్రవారం నుంచి కంకర, ఎం.శాండ్ యూనిట్లను మూసివేసి నిరసన తెలుపుతామని యూనియన్ అధ్యక్షుడు డీ.సిద్దరాజు చెప్పారు. ఇప్పటికే రాయల్టీ చెల్లించినప్పటికీ, మైనింగ్ కాంట్రాక్టర్ల నుంచి దానిని మళ్లీ వసూలు చేయడం సరికాదన్నారు. క్వారీయింగ్ రంగంపై అదనపు భారం మోపే చర్యను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.


