బళ్లారి రూరల్ : ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే అన్నింటినీ సమకూర్చుకోవచ్చు. ఆరోగ్యంగా లేకపోతే ఎన్ని ఉన్నా వ్యర్థమే. సమతుల్యమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని బీఎంసీఆర్సీ నర్సింగ్ కళాశాల విద్యార్థులు ప్రదర్శన ద్వారా రోగులకు, సంబంధీకులకు తెలిపారు. జాతీయ న్యూట్రీషినల్ వారోత్సవాల్లో భాగంగా గురువారం బీఎంసీఆర్సీ ఆవరణలో సమతుల్య ఆహారంపై జాగృతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, చేపలు సమపాళ్లలో తీసుకోవాలన్నారు. మనం తీసుకొనే ఆహారంలో క్యాల్షియం, పొటాషియం, అయోడిన్, ప్రోటీన్స్ ఉండేలా చూసుకోవాలని రోగులకు సూచించారు. జంక్ ఫుడ్స్ తీసుకోవం వల్ల స్థూలకాయం, గుండెజబ్బులు, మధుమేహం వస్తాయని తెలిపారు. కళాశాల సిబ్బంది నందిని, ఉమ, ఫర్జానా, జయశ్రీ , త్రివేణి పాల్గొన్నారు.


