రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకకు ప్రత్యేకంగా రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించామని రాష్ట్ర ముఖ్యమంత్రి శివకుమార్ పేర్కొన్నారు. గురువారం కలబుర్గి సర్దార్ వల్లబ్బాయి పటేల్ క్రీడా మైదానంలో కళ్యాణ కర్ణాటక విమోచన దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. దేశానికి ఆగస్టు నెలలో స్వాతంత్య్రం వస్తే కళ్యాణ కర్ణాటకకు ఏడాది అనంతరం సెప్టెంబర్ 17 రాచరిక వ్యవస్థకు స్వస్తి పలికిన రోజు అని అభివర్ణించారు. వెనుక బడిన కళ్యాణ కర్ణాటక ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేకంగా ఈ ఏడాది రూ.5 వేల కోట్లను కేటాయించి, ఈ ఏడాది రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధి, రాజ్యాంగంలోని ఆర్టికల్–371(జె) ఉప కార్యాలయం కలబుర్గిలో ఏర్పాటు చేస్తామన్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో పదో తరగతి ఫలితాల వృద్ధికి అక్షర ఆవిష్కార పథకంలో 16,041 మంది ఉపాధ్యాయులను నియమిస్తామన్నారు. మంత్రులు, శాసన సభ్యులు, జిల్లాధికారి, జెడ్పీ సీఈఓ, ఎస్పీలున్నారు.
ప్రత్యేక అభివృద్ధి పథకం అమలు
కళ్యాణ కర్ణాటకకు ప్రత్యేకంగా అభివృద్ధి పథకం చేపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి శివకుమార్ వెల్లడించారు. గురువారం కలబుర్గిలోని సర్దార్ వల్లబ్బాయి పటేల్ క్రీడా మైదానంలో కళ్యాణ కర్ణాటక విమోచన దినోత్సవంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. నవలి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి 30 టీఎంసీల నీటి సేకరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో చర్చించామన్నారు. 12 ఏళ్లలో కళ్యాణ కర్ణాటక అభివృద్ధికి రూ.25 వేల కోట్లు నిధులు కేటాయించామని, వాటిలో రూ.14 వేల కోట్లు వ్యయం చేశారన్నారు. ఆరోగ్య శాఖకు రూ.429 కోట్లు, తాగునీటి కోసం రూ.7200 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. కలబుర్గి స్మార్ట్ సిటీ కోసం రూ.1685 కోట్లు కేటాయించామన్నారు. కలబుర్గిని హబ్ సిటీతో పాటు ఆర్థిక జోన్గా పరిగణిస్తామన్నారు.
రాచరిక వ్యవస్థకు ముగింపు పలికిన రోజు
కలబుర్గిలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్


