సాక్షి,బళ్లారి: హైదరాబాద్ నిజాం నవాబు పాలన నుంచి విముక్తి పొందిన కళ్యాణ కర్ణాటక(క–క) ప్రాంత సమగ్రాభివృద్ధికి రూ.18 వేల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి టీ.రఘమూర్తి పేర్కొన్నారు. ఆయన గురువారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మున్సిపల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 79వ కళ్యాణ కర్ణాటక విమోచన దినోత్సవంలో పాల్గొని, జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం మాట్లాడారు. సర్దార్ వల్లబ్భాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రు తీసుకున్న దృఢ నిర్ణయ ఫలితంగా 1948 సెప్టెంబర్ 17వ తేదీన ఈ ప్రాంతానికి విముక్తి లభించిందన్నారు.
మహనీయులను స్మరించుకోవాలి
ఈ చారిత్రక పోరాటంలో ఎందరో త్యాగాలు, బలిదానాలు కూడా చేశారని గుర్తు చేశారు. ఆ మహనీయులందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వెనుకబడిన ఈ ప్రాంత జిల్లాల్లో ఆర్టికల్– 371(జే) అమలుతో విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. నిధుల కొరత లేదని, అధికారులు వేగవంతంగా పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నందున కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వర్షాభావ ప్రాంతాల్లో కరువును ప్రకటించి సహాయ చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే కరువు తాలూకాలను ప్రకటించామని, అన్ని ప్రాంతాల్లో కూడా ఉపాధి కల్పించి రైతు కూలీలను ఆదుకుంటామన్నారు.
రైతులు ధైర్యంగా ఉండాలి
రైతులు ఏ ఒక్కరు కూడా ధైర్యం కోల్పోకూడదన్నారు. ఐదు గ్యారెంటీల ద్వారా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంత పోరాట సమితి గౌరవాధ్యక్షుడు సిరిగేరి పన్నారాజ్ ప్రత్యేక ఉపన్యాసం చేశారు. అనంతరం హైదరాబాద్ కర్ణాటక విమోచన అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఆర్టికల్– 371(జే) కోసం కృషి చేసిన పోరాటయోధులను సన్మానించారు. జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్, ఎస్పీ సుమన్ పన్నేకర్, లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజు, ఐదు గ్యారెంటీ పథకాల అమలు సమితి జిల్లాధ్యక్షుడు చిదానందప్ప తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి రూ.18 వేల కోట్లు వ్యయం
ఎస్టీ వర్గాల సంక్షేమ మంత్రి రఘుమూర్తి


