సాక్షి,బళ్లారి: నగరంలోని సెంటినరీ హాల్లో అంతర్జాతీయ హిందూ పరిషత్, రాష్ట్రీయ భజరంగదళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హిందూ మహా గణపతి భారీ శోభాయాత్ర ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు హిందూ మహా గణపతి ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శరణ పాటిల్ పేర్కొన్నారు. ఆయన గురువారం సెంటినరీ హాల్లో విలేకరులతో మాట్లాడారు. నగరంలో ప్రతిష్టాపకంగా ఏర్పాటు చేసిన హిందూ మహా గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపడుతున్నామన్నారు. ఈ శోభాయాత్ర రాయల్ సర్కిల్, బ్రూస్పేట పోలీసు స్టేషన్ సర్కిల్, మోతీ సర్కిల్ మీదుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా కాంతారా సినిమాలో రిషబ్శెట్టి చేసిన విధంగా కేరళకు చెందిన నృత్య బృందం నిర్వహిస్తారన్నారు. 51 మంది కేరళ బృందం నృత్యాలు, మల్లకంబ పోటీలు కూడా ఉంటాయన్నారు. భక్తులకు అందించిన కూపన్లను ఆదివారం సాయంత్రం 4 గంటల లోపు బాక్స్లో వేయాలని కోరారు. రాయల్ సర్కిల్ వద్ద డిప్ తీస్తామని, లక్కీడిప్లో గోల్డెన్ కోటెడ్ వినాయక విగ్రహాన్ని 21 మందికి అందజేస్తామన్నారు. ఉత్సవ సమితి ప్రముఖులు రమేష్ బుజ్జి, గాదిలింగనగౌడ, సాగర్ సామ్రాట్, మల్లికార్జున, కేసీ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


