న్యూస్రీల్
రాయచూరు రూరల్: పోలీసు శాఖలోని ఎస్డీఆర్ఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేసే శ్రీశైల్ చౌగలే (37) ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావి సిటీలో జరిగింది. బుధవారం రాత్రి విధులు ముగించుకుని చెన్నమ్మ నగరలోని ఇంటికి వెళ్లి ఉరి వేసుకున్నాడు. భార్య చూసి వెంటనే ఆయన పనిచేసే ఆఫీసుకు కాల్ చేసి చెప్పింది. సిబ్బంది, పోలీసులు చేరుకుని తలుపులు పగలగొట్టి గదిలోకి వెళ్లారు. మృతదేహాన్ని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయాలు బహిర్గతం కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
త్వరలో డీఎస్పీ ప్రమోషన్
ఆయన బంధువులు మాట్లాడుతూ చౌగలే ప్రతిభావంతుడైన అధికారి అని, గతంలో రిజర్వు పోలీసు సీఐగా ఉండేవాడని తెలిపారు. త్వరలోనే డీఎస్పీగా ప్రమోషన్ వస్తుందని చెప్పేవాడని, ఇంతలోనే ఘోరం జరిగిందని విలపించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గున్న హిప్పోకు
సమీక్షా రెడ్డి పేరు?
బొమ్మనహళ్ళి: బుధవారం రాత్రి బెంగళూరు బన్నేరుఘట్ట జూ పార్క్లో నీటి ఏనుగు (హిప్పో పొటామస్)కు పిల్ల జన్మించింది. అది ఆడ నీటి ఏనుగు అయితే పశు వైద్యురాలు దివంగత సమీక్షా రెడ్డి పేరు పెట్టాలని అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే అధికారులకు సూచించారు. శివమొగ్గ జిల్లాలోని త్యావరెకొప్ప జూలో పశు వైద్యురాలైన సమీక్షా రెడ్డి.. అక్కడ నీటి ఏనుగుకు వైద్యం చేస్తుండగా అది దాడి చేయడంతో మరణించడం తెలిసిందే. బన్నేరుఘట్టలో 17 ఏళ్ల వయసున్న నీటి ఏనుగుకు ఇప్పుడు పిల్ల పుట్టింది. గతంలో ఓ పిల్ల జన్మించి మరణించింది. ఈ దఫా వైద్యులు దానిని జాగ్రత్తగా కాపాడాలని మంత్రి ఆదేశించారు.
కమణీయం..
సీతారాముల కళ్యాణం
కోలారు: బంగారుపేట తాలూకా మాకారహళ్లి గ్రామంలో శ్రీరామకోటి మహోత్సవం, సీతారామ కళ్యాణోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. శ్రీరామకోటి తారక మంత్రభజనలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హోమం, విశేష పూజలతో పాటు వసంతోత్సవం, అన్నసంతర్పణ జరిగింది.


