రాయచూరు రూరల్: కంప్లి– గంగావతి మధ్య తుంగభద్ర నదికి అడ్డంగా ఉన్న వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈనేపథ్యంలో కంప్లి వద్ద నూతన వంతెన నిర్మాణానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. రూ.100 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసి సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కంప్లి వద్ద వంతెన మీద నిత్యం వేలాది వాహనాలు సంచరిస్తుంటాయి. దీంతో కేఆర్డీసీఎల్ అధ్యక్షుడు అర్.జైప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సలహా సమితి సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. 65 ఏళ్ల క్రితం నిర్మించిన పాత వంతెన నేడు శిథిలావస్థకు చేరింది. ప్రతి ఏటా వర్షాకాలంలో తుంగభద్ర డ్యాం నుంచి నది గుండా భారీ ఎత్తున నీరు వదలడంతో కనీసం రెండు మూడు రోజుల పాటు వాహన రాకపోకలు నిలిచిపోతాయి. దీంతో కంప్లితో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతుండేవారు. ఈ విషయంపై కంప్లి ఎమ్మెల్యే జేఎన్ గణే్ష్ అసెంబ్లీలో చర్చించడంతో ఇన్చార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్, ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి పాత వంతెనను పరిశీలించిన తరువాత అనుమతించారు. కంప్లి వద్ద కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలని రైతులు, ప్రజా సంఘాలు, ప్రజలు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో చివరికి సర్కార్ వంతెన నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
రూ.100 కోట్లతో నిర్మాణానికి
ప్రతిపాదనలు సిద్ధం


