హుబ్లీ: ఉత్తర కర్ణాటకలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా.. శనివారం రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రారంభం అయ్యాయి. ఉత్తర కర్ణాటకలోని కొన్ని జిల్లాలలో వరుణుడు విజృభించాడు. ఇదే పరిస్థితి మరో మూడు రోజులు కొనసాగనుంది. వ్యవసాయ పనులు చేసుకునే రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. యాదగిరి, రాయచూరు, బాగలకోట, బళ్లారి, విజయనగర, దావణగెరె, చిత్రదుర్గ, తుముకూరు, చిక్కబళ్లాపుర, బెంగళూరు రూరల్, నగర జిల్లాలు, కోలారు, రామనగర, చామరాజ నగర, దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ జిల్లాలో ఆదివారం ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో వర్షాలు కురిశాయి.


