బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలోని సూర్యనగర్లోని 4వ స్టేజ్లో ఇండ్లవాడి వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ స్టేడియం, క్రీడా సముదాయ నిర్మాణానికి సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శంకుస్థాపన చేశారు. శనివారం ఆర్భాటంగా ఈ కార్యక్రమం జరిగింది. క్రీడలు, పర్యాటకం, ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పనతో పాటు ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి తాము చొరవ తీసుకున్నామని సిద్దరామయ్య అన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో సూర్య షైన్, సూర్య డివైన్ గృహ సముదాయాల నిర్మాణాలకు పునాది రాయి వేశారు. ఈ ప్రాజెక్టు కోసం భూమిని ఇచ్చిన భూ యజమానులకు స్థల కేటాయింపులు చేశారు.
బృహత్ స్టేడియం అవుతుంది
సిద్దరామయ్య మాట్లాడుతూ గృహ నిర్మాణాలకే పరిమితమైన గృహనిర్మాణ శాఖ, కేహెచ్బీ సంస్థలు ఇప్పుడు 80 వేల సీట్ల సామర్థ్యం గల స్టేడియంను నిర్మిస్తున్నాయని చెప్పారు. గుజరాత్లోని ప్రముఖ స్టేడియంలో సీట్లు 90 వేలయితే, ఈ స్టేడియంలో 80 వేలని, ఇది మన రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద స్టేడియమని చెప్పారు. దీనివల్ల చుట్టుపక్కల టూరిజం, నిర్మాణ, ఆర్థిక రంగాలు బలోపేతమవుతాయన్నారు. భూమి ధరలు పెరుగుతున్నందున, పేద, మధ్యతరగతి ప్రజలకు కేహెచ్బీ అందుబాటు ధరలకే ఫ్లాట్లను నిర్మించి ఇస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య బ్యాటింగ్ ఆడారు. పెద్దసంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు పాల్గొన్నారు.
సీఎం సిద్దరామయ్య
బెంగళూరు శివార్లలో నూతన మైదాన నిర్మాణానికి శంకుస్థాపన


