హొసపేటె: బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల రైతులకు జీవనాడి తుంగభద్ర డ్యాం కొత్త క్రస్ట్గేట్లకు గొలుసులను అమర్చే పనులు శరవేగంగా సాగుతున్నాయి. డ్యాంకు కొత్త క్రస్ట్గేట్లను ఏర్పాటు చేసిన అనంతరం కొత్త గొలుసులను అమర్చే పనులను తుంగభద్ర బోర్డు అధికారులు ఇటీవల ప్రారంభించారు. డ్యాంలోని 33వ క్రస్ట్గేట్కు కొత్త చైన్లను అమర్చే ట్రయల్ విజయవంతంగా పూర్తయిన అనంతరం ఇతర గేట్లకు కూడా కొత్త చైన్లను అమర్చే పనులను చేపట్టారు. ప్రస్తుతం డ్యాంకు నాలుగు కొత్త గొలుసులు చేరుకున్నాయని, మిగిలిన గేట్ల గొలుసులు త్వరలో వస్తాయని అధికారులు చెప్పారు. జలాశయం భద్రత కోసం పాత తుప్పుపట్టిన గొలుసులను తొలగించి కొత్త గొలుసులను అమర్చే పనులను ప్రత్యేక నిపుణుల బృందం మార్గదర్శకత్వంలో చేపడుతున్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే జలాశయంలోని అన్ని గేట్లకు కొత్త గొలుసులను అమర్చడమే లక్ష్యమని తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు.


