రాయచూరు రూరల్: వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు వ్యవసాయం రంగంపై ఆసక్తి పెంచుకోవాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన అధికారి జాగృతి దేశ్మాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సార్ప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. నేడు అంతరించి పోతున్న వ్యవసాయ రంగానికి పునరుత్తేజం కల్పించేందుకు అన్ని విధాలుగా సహాయ పడాలని పేర్కొన్నారు. రైతులకు ఆధునికి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని సూచించారు.
క్రమశిక్షణతో చదివితే ఉజ్వల భవిష్యత్తు
రాయచూరు రూరల్: నేటి పోటీ యుగంలో విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సీనియర్ సంపాదకుడు సుశులేంద్ర తెలిపారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఇటీవల విడుదలైన పది, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన పాత్రికేయుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను బాగా చదివించాలని తెలిపారు. కార్యక్రమంలో విజయ్, సత్యనారాయణ, చెన్నబసవ, ఖాన్సాబ్, విశ్వనాథ్ పాల్గొన్నారు.
ఉగ్రవాద నిర్మూలనకు కృషి
రాయచూరు రూరల్: దేశంలో ఉగ్రవాద నిర్మూలనకు అందరూ శ్రమించాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్కుమార్ కాందూ పిలుపునిచ్చారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో జాతీయ ఉగ్రవాద దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలనపై అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలు శాంతియుతంగా జీవనం సాగించాలంటే ఉగ్రవాదులను అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.


