రాయచూరు రూరల్: విద్యా రంగంలో వెనుక బడిన కళ్యాణ కర్ణాటకలో ఉత్తమ ఫలితాలు సాధించాలనే తపన తపనగానే మిగిలింది. కళ్యాణ కర్ణాటక పరిధిలో కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్, బళ్లారి, విజయనగర జిల్లాలు ఉన్నాయి. కలబుర్గి జిల్లాలో హైస్కూళ్లలో 550, ప్రాథమిక పాఠశాలల్లో 2740, రాయచూరు జిల్లా హైస్కూళ్లలో 926, ప్రాథమిక పాఠశాలల్లో 4304, యాదగిరి జిల్లా హైస్కూళ్లలో 761, ప్రాథమిక పాఠశాలల్లో 3363, కొప్పళ జిల్లా హైస్కూళ్లలో 589, ప్రాథమిక పాఠశాలల్లో 1952, బీదర్ జిల్లా హైస్కూళ్లలో 450, ప్రాథమిక పాఠశాలల్లో 607, బళ్లారి జిల్లా హైస్కూళ్లలో 496, ప్రాథమిక పాఠశాలల్లో 1450, విజయనగర జిల్లా హైస్కూళ్లలో 143, ప్రాథమిక పాఠశాలల్లో 860 ఉపాధ్యాయినుల పోస్టుల ఖాళీలు, పీఈటీ, డ్రాయింగ్ ఉపాధ్యాయులు 2745, విషయ పరిశీలకుల పోస్టులు 598 ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉపాధ్యాయుల ఉద్యోగాలను పొందిన ఏడాదికే మైసూరు, తుమకూరు, విజయపుర, బాగల్కోటె, గదగ్, హాసన, హావేరి, మండ్య, రామనగర, శివమొగ్గ, దావణగెరె తదితర జిల్లాలకు తిరిగి బదిలీలపై వెళ్లిపోయారు.
నియామకాలపై నిర్లక్ష్యంతోనే చేదు ఫలితాలు
వారి స్థానంలో ఉపాధ్యాయులను నియామకాలు చేసుకోవడంలో ప్రభుత్వం పెడ చెవిన పెట్టడం వల్ల నేడు పది ఫలితాల్లో తక్కువ శాతం ఉత్తీర్ణత ఫలితాలు వచ్చాయి. 48 మంది శాసన సభ్యులు, ఆరుగురు మంత్రులున్నా విద్యా రంగంపై మక్కువ చూపడంలో నిరాసక్తతను కనబరుస్తున్నారు. నూతనంగా 14 బీఈఓ పోస్టులతో పాటు కార్యాలయాలను ప్రారంభించడానికి కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి కార్యదర్శి, విద్యా శాఖ కమిషనర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కలబుర్గి జిల్లాలో యడ్రామి, కాళగ, కమలాపుర, యాదగిరి జిల్లాలో గురుమఠకల్, రాయచూరు జిల్లాలో అరికెరె, మస్కి, సిరవార, కొప్పళ జిల్లాలో కారటగి, కుకనూరు, బీదర్ జిల్లాలో చిటగుప్ప, కమలానగర, బళ్లారి జిల్లాలో కురుగోడు, విజయనగర జిల్లా కొట్టూరులో ప్రారంభించడానికి అనుమతించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు.
కల్యాణ కర్ణాటకలో 22,953
ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
అత్యధికంగా ఉపాధ్యాయినుల కొరత
మౌనం వహించిన మంత్రులు, ఎమ్మెల్యేలు
14 కొత్త బీఈఓ ఉద్యోగాలకు ప్రతిపాదనలు


