తుమకూరు: గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలోని 580 హామీల్లో 290కి పైగా హామీలను నెరవేర్చామని సీఎం సిద్దరామయ్య చెప్పారు. రెండేళ్లలో మిగతా భరోసాలను నెరవేరుస్తామని తెలిపారు. ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంలో మంగళవారం తుమకూరు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీ మైదానంలో అట్టహాసంగా జరిగిన సాధన సమర్పణ సమావేశంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు పాల్గొన్నారు. సిద్దరామయ్య మాట్లాడుతూ 35 ఏళ్లుగా బీజేపీనే అధికారంలో ఉన్న గుజరాత్.. కర్ణాటక అభివృద్ధి నమూనా ముందు డొల్ల అని వర్ణించారు. పెట్రో ధరల భారానికి ప్రధాని మోదీనే కారణమని, నీట్ పరీక్ష రద్దుకు మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా మహిళలకు భూహక్కు పత్రాలను పంపిణీ చేసి గిన్నిస్బుక్లో రికార్డు నమోదు చేశారు. సీఎం, డీసీఎంలు కలివిడిగా కనిపించారు.
తుమకూరును బెంగళూరు
● ఉత్తర జిల్లా చేయాలి: హోంమంత్రి
బెంగళూరుకు అతి సమీపంలో ఉన్నందున తుమకూరును బెంగళూరు ఉత్తర జిల్లాలో చేర్చాలని హోం మంత్రి జి.పరమేశ్వర్ డిమాండ్ చేశారు. ఆయన ప్రసంగిస్తూ బెంగళూరుకు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉందని అన్నారు. అందువల్ల, తుమకూరును బెంగళూరు ఉత్తర జిల్లాలో చేర్చడానికి చొరవ తీసుకోవాలని సీఎం, డీసీఎంలను కోరారు. కాగా, ఈ సభకు వేలాదిమంది ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారు.
సీఎం సిద్దరామయ్య
తుమకూరులో అర్భాటంగా మూడేళ్ల సాధన సభ


