బళ్లారిఅర్బన్: బళ్లారి జిల్లా కంప్లి తాలూకాలోని శ్రీరామరంగాపురం గ్రామంలో 101 దళిత కుటుంబాల సంక్షేమం కోసం ఇంటి స్థలాలు మంజూరు చేయాలని మంగళవారం కర్ణాటక మాదిగ రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కరియప్ప గుడిమని నేతృత్వంలో వందలాదిగా మహిళలు, గ్రామస్తులు పాల్గొని జిల్లాధికారికి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారికి, ఎంపీ ఈ.తుకారాంకు వినతిపత్రాలను సమర్పించారు. ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్న గ్రామాల్లో సొంత ఇల్లు లేని పేద దళిత కుటుంబాలకు ప్రభుత్వం ఇంటి స్థలాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో పెరుగుతున్న జనాభాతో పాటు ఉమ్మడి కుటుంబాల నుంచి కూడా కొందరు ఇంటి స్థలాలు లేక బయటికి రాలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. గ్రామంలో గృహ నిర్మాణ స్థలాల కోసం గ్రామస్తులకు సుమారు 3 ఎకరాల 94 సెంట్ల భూమిని గుర్తించారు. దాని విలువ రూ.2.56 కోట్లు అవుతుందన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ భూమిని కొనుగోలు చేసి ఇంటి స్థలాలను మంజూరు చేయాలన్నారు. గ్రామస్తులు రామకృష్ణ, నీలప్ప పెయింటర్, సోమయ్య, కృష్ణ, పెద్దన్న, మోహన్రాజ్, వెంకటస్వామి, నవీన్కుమార్ మల్లమ్మ, లక్ష్మీ, సరస్వతి, సరోజమ్మలతో పాటు వందలాది మంది పాల్గొన్నారు.


