బనశంకరి: సిలికాన్ సిటీలో ఇంటిని లీజుకు తీసుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇళ్లు బాడుగకు తీసుకునేవారిని మభ్యపెట్టి సుమారు రూ.200 కోట్లకు పైగా వంచనకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. జాన్స్ అసెట్ పేరుతో ఓ వంచకుడు 300 మందికి పైగా ప్రజలను దోచేశాడు, యజమాని స్టీఫెన్ జాన్ పారిపోగా బాధితులు ఇందిరానగర ఠాణాలో ఫిర్యాదు చేశారు.
పెట్టుబడి పెడితే.. అద్దె చెల్లిస్తానని.
ఇల్లు బాడుగకు కావాలనుకునేవారే స్టీఫెన్ లక్ష్యం. తమ వద్ద పెట్టుబడిపెడితే.. మేము మీకు ఇంటిని గాలించి ఇప్పిస్తాం, నెల అద్దెను మేమే చెల్లిస్తామని ప్రచారం చేసుకున్నాడు. ఒక్కొక్కరి నుంచి రూ.10 నుంచి 75 లక్షల వరకు డిపాజిట్లు తీసుకున్నాడు. ఈ డబ్బును కంపెనీలలో పెట్టుబడి పెట్టి ఆ వడ్డీ డబ్బుతో ఇంటి బాడుగ కడతానని చెప్పేవాడు. కొన్ని నెలలు అద్దెలు చెల్లించడంతో చాలా మంది నిజమే అని నమ్మారు. తరువాత స్టీఫెన్ అద్దె కట్టకపోవడంతో ఇంటి యజమానులు బాడుగదారులను ప్రశ్నించారు. కొందరు వెళ్లి స్టీఫెన్ని ప్రశ్నించగా, డబ్బు వెనక్కి ఇవ్వడానికి నిరాకరించి, మీ డబ్బులకు నెలకు 4 శాతం వడ్డీ ఇస్తామని నమ్మించాడు. ప్రస్తుతం కంపెనీ మూసేసి కోట్లాది రూపాయలు డబ్బుతో పారిపోయాడు. కొత్త కస్టమర్ల నుంచి వచ్చిన డబ్బును పాత కస్టమర్లకు అందిస్తూ పొంజి స్కీమ్ నడిపేవాడని తెలిసింది. గతంలోనూ ఇతనిపై చీటింగ్ కేసు ఉంది.
300 మందికి పైగా కుచ్చుటోపీ
పరారీలో నయవంచకుడు


