రాయచూరు రూరల్: రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని యాదగిరి, రాయచూరు జిల్లాల్లో ఈదురు గాలులు, పిడుగులు బీభత్సం సృష్టించి ఒకరిని బలి తీసుకున్నాయి. లింగసూగూరు తాలూకా ముదుగల్ మండలం సోమలాపూర్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పొలం పనుల చేస్తున్న సమయంలో పిడుగు పడటంతో కరియప్ప అయ్యప్ప గెణికిహళ (47) అక్కడికక్కడే మృతి చెందాడు. మేగళపేటలో పిడుగు పడి మూడు గడ్డి వాములు కాలిపోయాయి. మరో వైపు హోరు గాలికి విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి కిందిపడ్డాయి. టిన్ షెడ్లు గాలికి కొట్టుకుని పోయాయి. కలబుర్గి జిల్లా చిత్తాపూరలో క్రీడా మైదానంలో నిర్మించిన పైకప్పులు ఎగిరిపోయాయి.


