డిపాజిట్ల స్కాంలో
సీఐడీ దర్యాప్తు
బనశంకరి: బెళగావిలో అక్యూమెన్ పేరిట రూ.4,500 కోట్ల డిపాజిట్ల వంచన కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బెళగావి పోలీసులు కేసు నివేదికను సీఐడీ పోలీసులకు అప్పగించారు. సీఐడీ డీఐజీ భీమాశంకర్ గుళేద్ నేతృత్వంలో బెళగావి పోలీస్ కమిషనర్ భూషణ్ బోర్సేతో భేటీ అయ్యారు. జప్తుచేసిన రికార్డులు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 35 వేలమంది నుంచి శివానంద నీలణ్ణవర్ పెట్టుబడుల పేరిట భారీ మొత్తాల్లో డిపాజిట్లను సేకరించాడు. వారికి నెలకు రూ.75 కోట్లకు పైగా వడ్డీ జమ చేస్తున్నట్లు తెలిసింది. కొన్నినెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. ఇతని వ్యాపారాలకు ఆర్బీఐ అనుమతులు ఏవీ లేవు. ఇతను వాడే నాలుగు బ్యాంకు అకౌంట్లను సీజ్ చేశారు. ఒక్కో అకౌంట్లో వందలాది కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం.


