హొసపేటె: చారిత్రాత్మక జైన ఆలయ సముదాయం సమీపంలో జరిపిన తవ్వకాల్లో, భారతీయ పురావస్తు శాఖ (ఏఎస్ఐ) హంపీ జోన్ అధికారులు విజయనగర రాజుల కాలం నాటి ఒక పురాతన ఆలయ పైకప్పును కనుగొన్నారు. విజయనగర సామ్రాజ్య చారిత్రక వైభవాన్ని మరోసారి వెల్లడిస్తున్న ఒక ముఖ్యమైన పురావస్తు ఆవిష్కరణ హంపీలో వెలుగు చూసింది. విజయనగర సామ్రాజ్యానికి చెందిన అనేక నిర్మాణాలు భూమిలో పూడిపోయి ఉండవచ్చనే అనుమానంతో, ఏఎస్ఐ బృందం జైన ఆలయ సముదాయం చుట్టుప్రక్కల ప్రాంతంలో తవ్వకాలను ప్రారంభించింది. ఈ క్రమంలో మట్టి పొరల కింద రాతితో నిర్మించిన ఒక ఆలయ పైకప్పు బయటపడింది. ఇది శతాబ్దాల నాటి ఆలయం అయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై ఏఎస్ఐ హంపీ జోన్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ కే.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక పరిశీలన ప్రకారం ఇటుకలతో నిర్మించిన ఆలయ గర్భగుడి కాలక్రమేణా తీవ్రంగా దెబ్బతినగా, ప్రస్తుతం గర్భగుడి పైకప్పు మాత్రమే బయటపడిందన్నారు.


