మైసూరు: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ముక్కు మొహం తెలియని వ్యక్తిని నమ్మి మైసూరులోని ఓ గృహిణి రూ.12.65 లక్షలను కోల్పోయింది. సోషల్ మీడియాలో కనిపించే మోసగాళ్ల మాయలో పడిపోయి పచ్చని కాపురాలకే ప్రమాదం తెచ్చుకుంటున్నారు. వివరాలు.. మైసూరులోని శక్తినగర నివాసి, ప్రభుత్వ ఉద్యోగి భార్య వేద (40) బాధితురాలు. 2025లో ఫేస్బుక్ ద్వారా డాక్టర్ జోసెఫ్ అలీ అనే వ్యక్తి తాను లండన్ నివాసినని వేదాకు పరిచయమయ్యాడు. తన తొమ్మిదేళ్ల కుమారుడిని కూడా పరిచయం చేశాడు. క్రమంగా అలీ, వేద ఫోన్ నంబర్లు మార్చుకుని తరచూ మాట్లాడుకునేవారు. తాను ఇండోనేషియాకు వెళుతున్నానని, తన ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని, టికెట్ కొనుగోలు కోసం డబ్బు సాయం చేయాలని అడిగాడు. దీంతో వేద పలుమార్లు రూ.1.85 లక్షలను బదిలీ చేసింది. తర్వాత కొన్ని రోజులకు తాను ఇండియాకు వచ్చానని, రూ.25 లక్షలను మీ ఖాతాకు బదిలీ చేస్తానని వేదాను నమ్మించాడు. ఇండియన్ కరెన్సీలోకి మార్చేందుకు చార్జీలు కట్టాలని రూ.10.80 లక్షలను బదిలీ చేయించుకున్నాడు. మళ్లీ రూ.1.55 లక్షలను పంపాలని మోసగాడు ఒత్తిడి చేయగా వేదాకు అనుమానం వచ్చింది. ఆమె ప్రశ్నించడంతో ఫోన్ను స్విచాఫ్ చేసుకున్నాడు. మొత్తం రూ.12.65 లక్షలను కోల్పోయిన వేద సైబర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.


