తుమకూరు, పావగడ: ఆయనకు తల్లి అంటే ఎంతో ప్రేమ. ఆమె మృతిని తట్టుకోలేక మానసిక క్షోభకు గురై అతడు కూడా ఆత్మహత్య కు పాల్పడిన విషాద ఘటన తుమకూరులో జరిగింది. వివరాలు.. పావగడ పీడబ్ల్యూడీ కార్యాలయంలో ఏఈ గా విధులు నిర్వహిస్తున్న మంజు ప్రసాద్ (32) తల్లి ఏడాది క్రితం చనిపోయింది. అప్పట్నుంచి తల్లి మరణాన్ని తట్టుకోలేక లోలోపలే కుంగిపోయేవాడు. దీంతో మానసిక రుగ్మతకు గురై ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు. సోమవారం ఉదయం ఆఫీసుకు వెళ్తానని ఇంటి నుంచి వెళ్ళిన మంజుప్రసాద్ కొరటగెరెలోని తన బంధువులకు మొబైల్ ఫోన్, ఇంటి తాళాలు అప్పగించాడు. నేరుగా తుమకూరు లోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రం దేవరాయన దుర్గ కొండ పైకి వెళ్ళాడు. కొండపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు రాత్రికి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. సుమారు 200 అడుగుల కిందన ఆయన మృతదేహం లభ్యమైంది. క్యాత్సంద్ర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మంజు ప్రసాద్ ఆత్మహత్య పట్ల సహ ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.
కొండపై నుంచి దూకి ప్రభుత్వ
ఇంజనీరు ఆత్మహత్య
తుమకూరు జిల్లాలో విషాద సంఘటన


