తుమకూరు: రాష్ట్రంలో పలుచోట్ల తాగునీరు కావాలని ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఇదే మాదిరిగా జిల్లాలోని శిరా తాలూకా గౌడగెరె ఫిర్కా తావరకెరె గ్రామ పంచాయతీ పరిధిలోని మారనగెరె గ్రామంలో రక్షిత మంచినీటి యూనిట్కు మరమ్మతులు చేసి నీటిని అందించాలని గ్రామస్తులు మంగళవారం ధర్నా చేశారు. గ్రామస్తుడు నటరాజ్గౌడ మాట్లాడుతూ రూ.లక్షలాది వెచ్చించి రక్షిత మంచినీటి యూనిట్లను నెలకొల్పినా సరైన పర్యవేక్షణ లేక చెడిపోతున్నట్లు చెప్పారు. ఈ యూనిట్ పనిచేయక 8 నెలలైందన్నారు. రిపేరీ చేయించాలని పీడీఓకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. అధికారులు వెంటనే బాగు చేయించి నీటి వసతి కల్పించాలని ప్రజలు ఖాళీ బిందెలు పట్టుకుని కోరారు.


