బళ్లారిటౌన్: కుడితిని వద్ద పరిశ్రమల స్థాపనకు భూమి కోల్పోయిన రైతులు చేపట్టిన పోరాటం 1243వ రోజుకు చేరుకుంది. అయితే ఇటీవల పోరాటాలు తీవ్రం చేస్తున్నందున జిల్లా ఏసీ కోర్టు 144 సెక్షన్, 163 సెక్షన్లను అమలు చేసి ఎలాంటి పోరాటాలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతు పోరాట నాయకులు కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చారు. ఈ క్రమంలో మంగళవారం తొలి రోజున నిరంతర ఉపవాస సత్యాగ్రహాన్ని చేపట్టారు. రైతు సంఘం నేత యూ.బసవరాజ్ మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులు 13 వేల ఎకరాల భూములను పరిశ్రమల కోసం కోల్పోయారన్నారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం భూమి ధరను కేటాయించలేదన్నారు. కేటాయించిన ధరనైనా ఇవ్వాలి లేదా భూములను వాపసు ఇవ్వాలనే డిమాండ్తో ననిరంతర ఉపవాస సత్యాగ్రహాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కమిటీ నేతలు జంగ్లి సాబ్, తిమ్మప్ప, నాగలింగ, శివకుమార్, నరసింహ మూర్తి, రాజప్ప, సిద్దప్ప, శ్రీధర్, మహిళా నాయకురాళ్లు మహంతమ్మ, మల్లమ్మ, పద్మావతి, సరోజ, కాళమ్మ తదితరులు పాల్గొన్నారు.


