శివాజీనగర: ఇరాన్– ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం, పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడడం తెలిసిందే. పెట్రోలు, డీజిల్ ఇంధనాలు బొటాబొటిగా సరఫరా అవుతున్నాయి. పలు రకాల ప్రచారాలు జరిగినప్పుడల్లా బెంగళూరుతో సహా అనేక జిల్లాల్లో బంకుల వద్ద జనం పోటెత్తి రద్దీ ఏర్పడుతోంది. కొన్ని వారాలుగా ఇలాంటి తంతు నిత్యకృత్యమైంది. కొందరు భయంతో భారీ మొత్తంలో పెట్రోలు, డీజిలు కొని నిల్వ చేసుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోందనే ఆరోపణలున్నాయి.
కట్టుదిట్టంగా అమలు చేయాలి
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంధన కొరత తీవ్రతరం కాకుండా ముందు జాగ్రత్తలు వహించేందుకు ఆహార పౌరసరఫరాల శాఖ సిద్ధమైంది. పెట్రోల్, డీజిల్ పంపిణీపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు, బంకుల యజమానులకు సూచనలు చేసింది. అలాగే మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించింది. ఉల్లంఘించే పెట్రోల్ బంక్ల మీద కఠిన చర్యలు తీసు కుంటామని తెలిపింది.
పెట్రోలు, డీజిల్ విక్రయాలపై
కొత్త నియామాలు
ఉల్లంఘించే బంకులపై చర్యలు
ప్రభుత్వం కార్యాచరణ
మార్గదర్శకాలు ఇవే
నియమాల ప్రకారం.. వాహనాలకు మాత్రమే పెట్రోలు, డీజిల్ పోయాలి. గరిష్టంగా 200 లీటర్ల వరకూ అనుమతి ఉంది.
ఎవరైనా గానీ బాటిల్లు, క్యాన్లు వంటి వాటిలో ఇంధనాన్ని తీసుకెళ్లరాదు, అలా వచ్చిన వారికి బంకుల సిబ్బంది ఇంధనం ఇవ్వరాదు.
సాధారణ పెట్రోలు బంకులు భారీస్థాయిలో ఒకరికే ఇంధనం సరఫరా చేయడానికి వీలు లేదు. అతిక్రమించి బల్క్ అమ్మకం చేసినచో లైసెన్స్ రద్దు లాంటి తీవ్ర చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వ్యవసాయ కార్యకలాపాలకు, ఆక్వా రంగానికి డీజిల్ సరఫరాలో ఎలాంటి తారతమ్యం జరగకుండా అధికారులు దృష్టిసారించాలి. ఇలా పలు నిబంధనలను రూపొందించారు.


