యశవంతపుర: రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఓ చోట ఏనుగులు వీరంగం సృష్టిస్తున్నాయి. రైతులు, కూలీలపై ప్రతాపం చూపిస్తూ ఉంటాయి. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా చార్మాడీఘాట్ రోడ్డులో ఆదివారం ఒంటరి ఏనుగు హల్చల్ చేయడంతో వాహనదారులు అందోళనకు గురయ్యారు. ఈ ఘాట్లో దక్షిణ కన్నడ, చిక్కమగళూరుల మధ్య వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. వీకెండ్ కావడంతో వాహన రద్దీ ఎక్కువగా ఉంది. ఘాట్ మార్గం 10 మలుపు వద్ద భారీ అడవి ఏనుగు నిలబడింది. దీంతో గంటలకొద్దీ కారు, బస్సు, బైకిస్టులు ఎక్కడివారక్కడే నిలిచిపోయారు. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మలెనాడు భాగంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఏనుగులు కనిపించటం సహజం, అయితే ఇప్పుడు ఘాట్రోడ్డులోకి కూడా రావడంతో ప్రయాణికులు హడలిపోయారు. కొందరు ఏనుగును మొబైల్ ఫోన్లో వీడియోలు తీయసాగారు. రెండు వైపులా వాహనాలు కిలోమీటర్ కొద్దీ నిలిచి పోయ్యాయి. ఏనుగుకు దగ్గరగా వెళ్లరాదని అటవీ సిబ్బంది ప్రయాణికులకు సూచించారు. రెండు గంటల తరువాత ఏనుగు నెమ్మదిగా అడవిలోకి వెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
చార్మాడి రూట్లో గందరగోళం


