దొడ్డబళ్లాపురం: కారు, బైక్ ముఖాముఖి ఢీకొన్న ప్రమాదంలో తండ్రి, కుమారుడు చనిపోగా, తల్లి, చిన్న కొడుకు తీవ్రంగా గాయపడిన సంఘటన హాసన్ తాలూకా శివారులోని బిట్టగౌడనహళ్లి వద్ద దేవేగౌడ సర్కిల్లో జరిగింది. గోరూరుకు చెందిన జయణ్ణ (38), మిథున్ (8) మృతులు, రజిని (29), మిలన్ (4) క్షతగాత్రులు. అందరూ ఒకే బైక్లో హాసన్లో 10 ఏళ్లకోసారి జరిగే దేవీరమ్మ జాతరకు వచ్చారు. జాతర చూసుకుని బైక్లో తిరిగి వెళ్తుండగా దారి మధ్యలో వేగంగా వచ్చిన కారు వీరిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నలుగురినీ ఆస్పత్రికి తరలిస్తుండగా జయణ్ణ, మిథున్ దారిలో మృతిచెందారు. తల్లీ, కొడుకు చికిత్స పొందుతున్నారు. కారు అతివేగంతో దూసుకువచ్చి ఇంత ఘోరానికి కారణమైందని స్థానికులు ఆరోపించారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బైక్ను ఢీ, తండ్రీ కొడుకు మృతి


