సాక్షి బళ్లారి: కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి సమీపంలోని అంజనాద్రిలో వెలసిన ఆంజనేయస్వామి ఆలయానికి హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఏఎంఆర్ గ్రూప్ అధినేత మహేశ్వర్రెడ్డి సమర్పించిన రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు వివాదానికి దారి తీశాయి. రెండు రోజుల క్రితం మహేశ్వర్రెడ్డి స్వామివారికి గద, కిరీటం తదితర ఆభరణాలను సమర్పించిన సంగతి విదితమే. అయితే వాటిని జిల్లా యంత్రాంగం పరిశీలించిన తర్వాత వాటిలో కేవలం 28 గ్రాముల బంగారం మాత్రమే ఉందని, తామ్రం, రాగితో తయారు చేసి బంగారు పూతతో ఆభరణాలను సమర్పించారని తేలింది. దీంతో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తామ్రంపై బంగారు పూత పూసి ఆభరణాలను తయారు చేసినట్లు తేలడంతో సదరు వ్యక్తికి నోటీసు జారీ చేశారు. ఆభరణాలకు సంబంధించి కచ్చితమైన బిల్లులను ఇవ్వాలని సూచించారు. అయితే ఈ బంగారు ఆభరణాలకు సంబంధించిన బిల్లులు ఇవ్వకపోవడంతో చర్చ నడుస్తోంది. ఏదేమైనా ఈ ఆభరణాలు తయారు చేసిన వారు ఇలా తామ్రంతో చేసి పైన బంగారు పూత పూశారా? అన్నది సమగ్ర దర్యాప్తులో తేలాల్సి ఉంది.
అది నకిలీ బంగారమని తేల్చిన జిల్లా యంత్రాంగం
చర్చనీయాంశంగా గోల్డ్ ప్లేటెడ్
ఆభరణాల సమర్పణ


