హొసపేటె: అతివేగంగా వచ్చిన టాటా ఏస్ గూడ్స్ వాహనం ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం తాలూకాలోని ధర్మసాగర్ గ్రామం సమీపంలో జరిగింది. ఉదయం బళ్లారి నుంచి హొసపేటె వైపునకు వస్తున్న కారును ఎదురుగా వచ్చిన టాటా ఏస్ గూడ్స్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హొసపేటె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టాటా ఏస్ గూడ్స్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం ప్రమాదానికి కారణమని తెలిసింది. గాదిగనూరు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. జాతీయ రహదారి–63పై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు తరచుగా చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఆటోను ఢీకొన్న కారు..
హుబ్లీ: కారు డ్రైవర్ మద్యం మత్తులో ఆటో రిక్షాను ఢీకొట్టాడు. ఈ ఘటన ధార్వాడ జిల్లా ఆస్పత్రి ఆవరణలో చోటు చేసుకోగా... అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రతి నిత్యం వేల సంఖ్యలో ప్రజలు నడిచి వెళ్లే జిల్లా ఆస్పత్రి ఎమర్జెనీ యూనిట్ దగ్గర తాగిన మత్తులో కారు నడుపుకుంటూ వచ్చి ఆటో రిక్షాను ఢీకొట్టాడు. అనంతరం ఆ కారు స్టిరింగ్పై ఆ మందు బాబు నిద్రలోకి జారుకున్నాడు. ఘటన స్థలానికి వచ్చిన ధార్వాడ ట్రాఫిక్ పోలీసులు ఆ కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఘటన నేపథ్యంలో జిల్లా ఆస్పత్రిలో కొద్ది సేపు గందరగోళం నెలకొంది. ట్రాఫిక్ పోలీసులు సకాలంలో వచ్చి తగిన చర్యలు తీసుకున్నారు.


