కేజీఎఫ్: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని ఎమ్మెల్యే రూపా శశిధర్ పిలుపునిచ్చారు. తాలూకా వ్యాప్తిలో పదవ తరగతిలో 90 శాతం పైగా మార్కులు సాధించిన 206 మంది విద్యార్థులకు ఆదివారం నగరంలోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రతిభా పురస్కారాలను అందించి మాట్లాడారు. టెన్త్ ఫలితాల్లో జిల్లాలో తాలూకా చివరి స్థానంలో నిలిచిందని, వచ్చే ఏడాది ఉత్తమ ఫలితాలను తీసుకు రావడానికి ఉపాధ్యాయులు శ్రమించాలన్నారు. కార్యక్రమంలో బీఈఓ నారాయణస్వామి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరసింహమూర్తి, నగర బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్యం పాల్గొన్నారు.
యువకుడు దారుణ హత్య
మాలూరు: యువకుడిని కొడవలితో నరికి ఆపై తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేసిన ఘటన టీకల్ ఫిర్కా కెజి హళ్లి సంత మైదానంలో చోటు చేసుకుంది. తాలూకాలోని జంగానహళ్లి గ్రామానికి చెందిన పురుషోత్తం (26) హత్యకు గురైన యువకుడు. పాత గొడవలే హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. లేదా ఎవరైనా కిరాయి హంతకులు హత్య చేయించి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం తెలుసుకున్న మాస్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
వేసవి శిబిరాలతో
ప్రతిభ వెలికితీత
బొమ్మనహళ్లి: ఆనేకల్ పట్టణం పాత ప్రభుత్వ సెకండరీ పాఠశాల ఆవరణలో సంక్రమణ బలగం, వివిధ సంస్థల సహకారంతో చిన్నారుల కోసం వేసవి శిబిరం ఏర్పాటు చేశారు. వ్యక్తిత్వ వికాసం, చిత్రలేఖనం, సినిమా, నాటక ప్రదర్శన, కథ, పాట, సాంఘిక చైతన్యం, గ్రామ క్రీడలపై అనేక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ప్రతిభను ప్రదర్శించారు. జాతీయ యువ పురస్కార గ్రహీత డాక్టర్ చిన్నప్ప చిక్కహగడే, న్యాయవాది పురుషోత్తం, శ్యామ్ రాజ్ ఉర్సు తదితరులు పాల్గొన్నారు.


