హొసపేటె: పెట్టుబడిదారులకు బీజేపీ కొమ్ముకాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వర్క్షాప్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈనెల 9న కేంద్రం ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్లను ప్రవేశ పెట్టిందని తెలిపారు. పెట్టుబడిదారులు మాత్రమే పాలించాలన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 20 మంది కార్మికులను ఒక యూనిట్గా పరిగణించేవారు. ఇప్పుడు ఈ సంఖ్యను 50 మందికి పెంచడంతో 49 మంది కార్మికులు ఉన్నా సరే వారికి ఎటువంటి లైసెన్స్ పొందే అర్హత లేకుండా పోయిందని మండిపడ్డారు. గతంలో 8 గంటల పని వేళలను ఇప్పుడు 12 గంటలకు పెంచారని తెలిపారు. అదనంగా మహిళలు కూడా రాత్రి షిఫ్టులలో పని చేయాలనే నిబంధన తీసుకొచ్చారన్నారు. యజమానులు తమకు నచ్చినంత సమయం కార్మికులతో పని చేయించుకోవచ్చనే చట్టాన్ని అమలులోకి తెచ్చారు. తాము దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలను కూడా ఈ కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల విజ్ఞప్తులను ఆమోదించడానికి బదులుగా, ప్రభుత్వం కేవలం పెట్టుబడిదారుల సంఘాల విజ్ఞప్తులకు మాత్రమే ఆమోదం తెలుపుతోందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


