చిత్రదుర్గకు శుక్రవారం వచ్చిన మాజీ సీఎం
యడియూరప్పకు ఘనస్వాగతం దృశ్యం
చిత్రదుర్గలో పార్టీ జెండాలు, బంటింగ్లతో జాతీయ రహదారి కాషాయమయమైన దృశ్యం
బనశంకరి: మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అభిమానోత్సవం సందర్భంగా కోటెనాడు చిత్రదుర్గ పూర్తిగా కాషాయమయంగా మారింది. చిత్రదుర్గలోని రోడ్లు బంటింగ్స్, కటౌట్లతో నిండిపోయాయి. శనివారం నిర్వహించే ఉత్సవానికి స్వాగతం కోరుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. చారిత్రక నగరంలోని ప్రముఖ స్మారకాలు, వీధులు, సర్కిళ్లలో ప్రత్యేక అలంకరణ చేశారు. జాతీయ రహదారి–48లో 6 కి.మీ. వరకు కాషాయం బంటింగ్స్, అభిమానోత్సవ జెండాలు అమర్చారు. రాష్ట్ర నలు మూలల నుంచి విచ్చేసే లక్షలాది మందికి 10 చోట్లకు పైగా పార్కింగ్ వ్యవస్థ కల్పించారు. మాదార చెన్నయ్య గురుపీఠం పక్కన గల విశాలమైన మైదానంలో అభిమానోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. గత మూడు రోజులుగా అక్కడే మకాం వేసిన బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై.విజయేంద్ర ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
10 లక్షల మందికి భోజనం
కోటెనాడు చిత్రదుర్గలో శనివారం నిర్వహించే మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప అభిమానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే లక్షలాది మంది అభిమానులకు సుమారు 500 మంది వంటవారితో వివిధ రకాల వంటకాలు సిద్ధం చేస్తున్నారు. 10 లక్షల మందికి టిఫిన్, భోజనం ఏర్పాటు చేస్తున్నారు. భోజనం, నీటి కొరత లేకుండా చూసే బాధ్యత బెంగళూరు ఎమ్మెల్యేలకు అప్పగించారు. 120 మంది స్వయం సేవకులు, ఇద్దరు ఎమ్మెల్యేలు భోజనం కౌంటర్ల వద్ద ఉంటారు.


