కోలారు: ముళబాగిలు తాలూకాలో గత నెల 7న జరిగిన దోపిడీకి సంబంధించి ముళబాగిలు నగరానికి చెందిన టిప్పు సుల్తాన్ (28), సాదిక్ బాషా (30), తౌహీద్ ఖాన్ (26) అనే దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్మస్థల గ్రామీణాభివృధ్ది సంస్థ ప్రతినిధి శశికళ బ్యాంకులో వారపు కంతులు కట్టడానికి కార్యాలయం నుంచి వెళ్తుండగా కాపు కాచిన నిందితులు ఆమె కళ్లలో కారం చల్లి, కత్తితో బెదిరించి రూ. 5.90 లక్షలు దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇంటికి నిప్పంటించి
నగదు, నగలు చోరీ
కోలారు: దుండగులు ఓ ఇంటికి నిప్పు అంటించి లక్షల రూపాయల విలువచేసే ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. ఈఘటన తాలూకాలోని మల్లసంద్ర గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శారదమ్మ వద్ద టీ అంగడి నిర్వహిస్తోంది. గురువారం రాత్రి ఆమె ఇంటిలో లేని సమయంలో దొంగలు చొరబడి లాకర్ పగుల గొట్టి నగలు, నగదు దోచుకున్నారు. ఎవరికి అనుమానం రాకూడదనే ఉద్దేశంతో ఇంటికి నిప్పంటించి వెళ్లారు. దీంతో వస్తు సామగ్రి కాలి బూడిదైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వేమగల్ పోలీసులు వచ్చి పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు.


