సాక్షి, బళ్లారి: నగరంతో పాటు, జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారు ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారు. దీనికి ప్రధాన కారణం హెల్మెట్ వాడకపోవడమే అని జిల్లా ఎస్పీ సుమన్ డి.పెన్నేకర్ తెలిపారు. శుక్రవారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలకు గురై దాదాపు 450 మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ పెట్టుకోకుండా ప్రమాదాలకు గురి అవుతున్నారన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. జూన్ 1వ తేదీ నుంచి నగరంతో పాటు, జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ పెట్టుకుని వాహనాలను నడపాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తారన్నారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. వైద్యులు కూడా హెల్మెట్ గురించి అవగాహన కల్పిస్తారన్నారు. ప్రాణం అమూల్యమైనదని.. పోయిన ప్రాణం తిరిగి రాదని తెలిపారు. కుటుంబ సభ్యుల కోసం మిమ్మల్ని నమ్ముకున్న వారి కోసం రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా 18 సంవత్సరాల్లోపు వారు వాహనాలు నడిపితే రూ.25 వేల జరిమానా విధిస్తామన్నారు. వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.
18 ఏళ్లలోపు వారు వాహనాలు నడిపితే రూ.25 వేల జరిమానా
జిల్లా ఎస్పీ సుమన్ డి.పెన్నేకర్


