సాక్షి, బెంగళూరు: సమాజంలో పోలీసుల సేవలు గణనీయమైనవి. అయితే నేరాలను అరికట్టే, శాంతి భద్రతలను పర్యవేక్షించే నాలుగో సింహమే నేరాలకు పాల్పడితే సామాన్య ప్రజలకు ఎవరు భద్రత కల్పిస్తారు? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొందరు పోలీసుల పరిస్థితి ఎలా ఉందంటే కంచె చేను మేసినట్లు తయారైంది. రాష్ట్రంలో గడిచిన రెండేళ్లలో 713 మంది పోలీసు అధికారులు, సిబ్బందిపై కేసులు నమోదయ్యాయి. విధి నిర్వహణలో లోపాలు, అవినీతి, నేర చర్యల్లో పాల్గొనడం వంటి అభియోగాల్లో కొందరు ఖాకీలు చిక్కుకున్నారు. దోపిడీ, దొంగతనం, హత్య వంటి పెద్ద నేరాల్లో కూడా పోలీసుల హస్తం ఉందని కొన్ని కేసులు చెబుతున్నాయి.
ఉధృతంగా నేరాలు.. చర్యలు
2024, జనవరి నుంచి 2026 జనవరి వరకు 95 మంది పోలీసులు క్రిమినల్ కేసుల్లో, 62 మంది అవినీతి కేసుల్లో, 556 మంది ఇతర నేరాల్లో పాల్గొని సస్పెన్షన్కు గురయ్యారు. ఇందులో 400 మందికి శిక్షలు కూడా ఖరారు అయ్యాయి. ధార్వాడలో బీజేపీ నేత యోగేశ్గౌడ హత్య కేసులో ఓ ఇన్స్పెక్టర్కు ఏడేళ్ల జైలు శిక్ష పడడం తెలిసిందే. ఇతరత్రా కేసుల్లో ఇంకా ఎంతెంత మందికి కఠిన శిక్షలు పడతాయోనని చర్చ మొదలైంది.
రకరకాల కేసుల్లో ప్రమేయం
కొందరు పోలీసులకు పరోక్షంగా హత్య కేసులతో ప్రమేయం ఉన్నట్లు తేలింది.
వారంట్ పనులు, సీజ్ చేసిన వాహనాలను వదిలిపెట్టేందుకు, చార్జ్షీట్ నుంచి నిందితుల పేర్ల తొలగింపులు, జూదం, క్రికెట్ బెట్టింగ్ల నుంచి పేరు తీసివేసేందుకు, ట్రాఫిక్ తనిఖీలు, బాల్య వివాహాల సమయాల్లో డబ్బులు డిమాండ్ చేయడం, దాడులు దౌర్జన్యాలకు పాల్పడడం వంటి నేరాలకు పాల్పడిన పోలీసులు సస్పెండ్ అయ్యారు. అంతేకాకుండా బాలికలపై లైంగిక వేధింపులు, అక్రమ అరెస్టులు, ఫిర్యాదులు స్వీకరించడంలో జాప్యం వంటి విధి నిర్వహణలో లోపాల కారణంగా కూడా ఇంటిముఖం పట్టారు. మరోవైపు ముఖ్యమైన కేసుల లీకేజీ, నకిలీ పాసుపోర్టులకు సహకారం, రౌడీలతో ములాఖత్ వంటి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు.
బెదిరింపులు, దోపిడీల కేసుల్లోనూ అభియోగాలు
నాలుగో సింహంపై మరకలు
తరచూ నేరారోపణలు,
సస్పెన్షన్ పర్వాలు
రెండేళ్లలో 713 మందిపై కేసులు
దావణగెరెలో బంగారం దోపిడీ కేసులో ఇద్దరు పోలీసు అధికారులు అరెస్టు అయ్యారు. ఐజీ స్క్వాడ్ పేరు చెప్పి 80 గ్రాముల బంగారాన్ని లాక్కున్నారు
బెంగళూరులో ఏటీఎంలకు నగదు నింపే వాహనం దోపిడీ కేసులో ఓ కానిస్టేబుల్ అరెస్టు
బీపీవో మేనేజర్ కిడ్నాప్ కేసులో ఒక హెడ్కానిస్టేబుల్కు కటకటాలు
.. ఇలా అనేకమంది పోలీసు సిబ్బందిపై తరచూ ఆరోపణలు, చర్యలు.


