ధర్మమే మనకు శ్రీరామరక్ష | - | Sakshi
Sakshi News home page

ధర్మమే మనకు శ్రీరామరక్ష

May 8 2026 1:25 PM | Updated on May 8 2026 1:25 PM

మైసూరు: మానవుని సర్వతోముఖాభివద్ధికి ధర్మమే (మతమే) పునాది అని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. గురువారం మైసూరులోని చాముండి కొండల పాదాల వద్ద ఉన్న సుత్తూరు మఠంలో జేఎస్‌ఎస్‌ మహావిద్యాపీఠం స్వర్ణోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ‘జాతీయ అభివృద్ధికి ప్రేరణగా సామాజిక సామరస్యం’ అనే అంశంపై ప్రసంగించారు. ’దయ ఉంటే, ధర్మం ఉంటుంది. ఆశ్రయం కోరి వచ్చిన పక్షిని కాపాడటానికి ఆత్మార్పణ చేసుకున్న శిబి చక్రవర్తి త్యాగం, దయ మనకు ఉండాలి. ఈ త్యాగం, కరుణ, దయలోనే సామరస్యం ఇమిడి ఉంది’ అని అన్నారు. మోక్షం, అర్థం, కామ వాంఛలలో కూడా ధర్మం ఇమిడి ఉంటుంది. సామరస్యం మధురమైన సంగీతంలా ఉండాలి. మనం సంయమనం కోల్పోతే, ఐక్యత ఏర్పడదు అని పేర్కొన్నారు. వేల సంవత్సరాలుగా మతం ఒక రక్షణ కవచంగా నిలిచింది. మనం ధర్మాన్ని కాపాడుకుంటే, ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మం లేకుండా మానవ జీవితానికి అర్థం లేదు. ధర్మం శాంతిని, ప్రశాంతతను ఇస్తుంది. ధర్మం ఉంటే సుఖం, శ్రేయస్సు ఉంటాయి. అది దుఃఖాన్ని కలిగించదు అని వివరించారు.

సమానత్వ భావన రావాలి

ఆధిక్య, నిమ్న అనే భావనను వదిలించుకుని, భారతీయులందరిలో ఏకతా భావం పెంపొందించాలి అని భాగవత్‌ పిలుపునిచ్చారు. రాజ్యాంగ సభలో అంబేడ్కర్‌ చేసిన ప్రసంగాలను మనం మళ్ళీ చదవాలి. సామాజిక స్వేచ్ఛ లేకుండా రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛను సాధించలేమని అంబేడ్కర్‌ అన్నారు. రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి ఫ్రెంచ్‌ విప్లవం నుంచి తీసుకున్నవి కావు. ఈ భావన భారతదేశానికి ప్రత్యేకమైనది. దీనిని తథాగత బుద్ధుడు అందించారు,’ అని తెలిపారు. ఈ సందర్భంగా చిక్కబళ్లాపురం సత్యసాయి ఆశ్రమ అధ్యక్షుడు మధుసూదన్‌ సాయి రచంచిన ‘ఆత్మనో మోక్షం జగత్‌ హితాయచ’ అనే పుస్తకాన్ని భాగవత్‌, సుత్తూరు మఠాధిపతి శివరాత్రి దేశికేంద్ర స్వామిజీ విడుదల చేశారు.

వేల ఏళ్లుగా కాపాడుతోంది

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌

Advertisement
 
Advertisement
Advertisement