బళ్లారిటౌన్: నగరంలోని జ్ఞానామృత కళాశాలలో ఈ నెల 9, 10 తేదీల్లో అంతర్రాష్ట్ర స్థాయిలో సాహిత్య గోష్టి, ద్రావిడ భాషా సాహిత్య సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుల సంఘం ట్రస్ట్ అధ్యక్షుడు యోగానందరెడ్డి, ప్రధాన కార్యదర్శి కే.శివలింగప్ప పేర్కొన్నారు. గురువారం పత్రికా భవనంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమేళ్మనంలో 17 దేశాల, భారతదేశంలోని 25 రాష్ట్రాల కవులు పాల్గొంటున్నట్లు తెలిపారు. సమేళ్మనం అనంతరం ప్రతి ఏటా మాదిరిగా సంగమ సాహిత్య పురస్కార అనే అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సమావేశానికి 50కి పైగా కన్నడ, తెలుగు సాహితీవేత్తలు హాజరవుతున్నట్లు తెలిపారు. తొలి రోజు ప్రారంభం కానున్న సమావేశానికి సాహితీవేత్త ఓఎల్ నాగభూషణ్, నేషనల్ బుక్ ట్రస్ట్ పత్తిపాత మోహన్ పాల్గొంటారన్నారు. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత అమరేశ్ నుగడోణి అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఇక రెండో రోజు మారుతీ పౌరోహిత్యం, పూర్ణిమ మాలుగమణి, శరణ బసవ బుడదుణ్ణి, మేఘనాథ్రెడ్డిలు పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రముఖులు బసవరాజు, వీరేష్, గడ్డిగిరి సాబ్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.


