బళ్లారి రూరల్ : నగరంలో సొంతిల్లు ఉన్నవారు మిద్దెలపై తోటల (టెర్రస్ గార్డెన్) పెంపకంపై ఆసక్తిని చూపాలని దావణగెరె జిల్లాధికారి జీ.ఎం.గంగాధరస్వామి సూచించారు. గురువారం దావణగెరె నగరంలోని శివకుమారస్వామి కాలనీలో సిటీ కార్పొరేషన్ కమిషనర్ ఉదయ్కుమార్ నివాసంపై ఏర్పాటు చేసిన మిద్దెతోటను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. కొత్తగా గృహనిర్మాణం చేపట్టేవారు, ఇప్పటికే సొంతిళ్లు ఉన్నవారు మిద్దైపె వర్షపునీటితో తోటలను పెంచుకోవాలన్నారు. ఇందుకోసం మున్సిపాలిటీ నీరు అవసరం లేదని తెలిపారు. సిటీకార్పొరేషన్ కమిషనర్ ఉదయ్కుమార్ మాట్లాడుతూ వర్షపు నీరు వృథా కాకుండా నిల్వ చేసి మిద్దెతోటలు పెంచొచ్చని అన్నారు. ఇందువల్ల భూగర్భ అంతర్జల నీటిమట్టం పెరుగుతుందన్నారు. జపాన్, కొరియా దేశాల తరహాలో మనం కూడా పూల మొక్కలను, పండ్లతోటలను, కూరగాయలను పండించుకోవచ్చన్నారు. నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతంలోను మిద్దెలపైన ఖాళీ ప్రదేశంలో తోటలను పెంచాలన్నారు.


