హొసపేటె: గనుల ప్రభావిత ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, అక్కడి నివాసితుల పునరావాసం కోసం కర్ణాటక గనులు, పర్యావరణ పునరావాస సంస్థ అర్హులైన లబ్ధిదారులకు సుమారు రూ.1,146 కోట్ల వ్యయంతో అన్ని ప్రాథమిక సౌకర్యాలతో కూడిన అత్యాధునిక గృహ వసతి సౌకర్యాన్ని కల్పిస్తోందని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి తెలిపారు. కర్ణాటక మైన్స్ ఎన్విరాన్మెంటల్ రిహాబిలిటేషన్ కార్పొరేషన్ పథకం కింద గనుల ప్రభావిత ప్రాంతాల పునరావాస ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైనదన్నారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యాన్ని, సమన్వయ లోపాన్ని సహించబోమని ఆమె అధికారులకు సూచించారు. నివాస సముదాయాల నిర్మాణ సమయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం పాటించాలన్నారు.
పనులు నాణ్యతగా చేపట్టాలి
పనులను నాణ్యతగా చేపట్టాలని, ప్రతి దశలోనూ తనిఖీ చేయాలని ఆదేశించారు. తాగునీరు, మురుగునీరు, విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా సిద్ధంగా ఉండాలి. 1183 మంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి లొసుగులు ఉండకూడదు. అర్హులైన గని బాధిత కుటుంబాలకు మాత్రమే ఈ సౌకర్యం కల్పించాలన్నారు. అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడిని కూడా ఈ పథకం నుంచి మినహాయించకూడదని ఆమె కట్టుదిట్టమైన ఆదేశాలిచ్చారు. నిర్ణీత కాలమితిలోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. జిల్లా పట్టణాభివృద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోహర్, సబ్ డిజిజనల్ అధికారి వివేక్, తహసీల్దార్ శృతి, మున్సిపల్ కమిషనర్ శివకుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు.
1183 కుటుంబాలకు
అత్యాధునిక గృహ వసతి
విజయనగర జిల్లాధికారిణి
కవిత ఎస్.మన్నికేరి


