కోలారు: వ్యవసాయ నీటిగుంతలో పడి అక్క, తమ్ముడు మృతి చెందారు. ఈ ఘటన బంగారుపేట తాలూకా బోడేనహళ్లి గ్రామంలొ చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రూప, బాబు దంపతుల కుమార్తె తనుశ్రీ (15), అదే గ్రామానికి చెందిన వరదరాజు, శ్యామల దంపతుల కుమారుడు కార్తీక్ (8) మృతులు. బంగారుపేట తాలూకాలోని నల్లగుట్టపల్లి గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో కార్తీక్ 3వ తరగతి చదువుతున్నాడు. కార్తీక్ ఆటలాడుతూ కాలుజారి వ్యవసాయ గుంతలో పడిపోయాడు. తమ్ముడిని రక్షించేందుకు గుంతలోకి దిగిన తనుశ్రీ కూడా నీటిలో మునిగి చనిపోయింది. తనశ్రీ యళేసంద్ర కిత్తూరు రాణి చెన్నమ్మ వసతి పాఠశాలలో పదవ తరగతి చదువుతూ ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. విషయం తెలుసుకున్న బంగారుపేట తహసీల్దార్ కే.ఎన్.సుజాత, బీఈఓ శశికళ గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఘటనపై కామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వ్యవసాయ నీటి గుంతలో పడి
అక్కా తమ్ముడు మృతి


