శివాజీనగర: ప్రముఖ పుణ్యక్షేత్రం, శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ల పునర్ లెక్కింపులో బీజేపీ నాయకులు క్రిమినల్ పన్నాగం పన్ని ఓట్ల దొంగిలించారని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. శృంగేరిలో ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి జీవరాజ్ విజయం సాధించడం తెలిసిందే. దీంతో మూడేళ్లుగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేగౌడ మాజీ కావడంతో కాంగ్రెస్ పెద్దల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
ఎందుకు చెల్లలేదు?
మంగళవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో సీఎం సిద్దరామయ్య మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజేగౌడ గత అసెంబ్లీ ఎన్నికల్లో 201 ఓట్లతో గెలుపు సాధించారు. రాజేగౌడకు ఈవీఎంలలో 59,171 ఓట్లు, 569 పోస్టల్ ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి జీవరాజ్కు ఈవీఎంలలో 58,970 ఓట్లు, పోస్టల్ ఓట్లు 692 వచ్చాయి. 200 ఓట్లతో రాజేగౌడ గెలిచారు. బీజేపీ అభ్యర్థి ఎన్నికల్లో అక్రమం జరిగిందని కేసు వేశారు అని సీఎం తెలిపారు. రీకౌంటింగ్లో 314 ఓట్లు మాత్రమే చెల్లినవి. 255 ఓట్లు చెల్లలేదు, అవి ఎందుకు చెల్లలేదో చెప్పాలన్నారు. జీవరాజ్కు రీకౌంటింగ్లో గతం కంటే 2 ఓట్లు తగ్గి 690 ఓట్లు వచ్చాయి, దీనిని చూస్తే బీజేపీ నాయకులు ఓట్ చోరీ చేశారనేది తెలుస్తుందన్నారు. రీకౌంటింగ్కు కేంద్ర పరిశీలకులు వచ్చారు, కుట్ర జరిగిందని వారే కేంద్రానికి లేఖ రాసినట్లు తనకు తెలిసిందన్నారు. ఏమవుతుందో చూడాలని అన్నారు. దావణగెరె, బాగల్కోట ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని, 2028 ఎన్నికల్లో కూడా తామే అధికారంలోకి వస్తామని చెప్పారు.
అభ్యర్థిపై కేసు.. హైకోర్టు ఆగ్రహం
శివాజీనగర: గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని శృంగేరి నూతన బీజేపీ ఎమ్మెల్యే జీవరాజ్ హైకోర్టులో అర్జీ దాఖలు చేశారు. మంగళవారం న్యాయమూర్తి విచారించారు. 2023 మే 13న జరిగిన ఘటన మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేస్తే ఎలా? ట్యాంపరింగ్ గురించి హైకోర్టుకు సమాచారం ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ చేస్తారా? ఓటమిపాలైనవారు ఎవరు కుట్ర చేస్తారు, ఎవరు వారు? పిలవండి, మీకు కళ్లు కనిపించవా, సస్పెండ్ చేయాల్సి ఉంటుంది.. అని ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ప్రస్తుత ఎన్నికలాధికారి గౌరవ్ శెట్టిపై ఎందుకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు, రాజకీయ ప్రభావానికి లోనై కేసులు పెట్టరాదు అని సూచించారు. జీవరాజ్పై బలవంతపు చర్యలు తీసుకోరాదని స్టే జారీ చేసి విచారణను వాయిదా వేశారు. దీంతో జీవరాజ్కు ఊరట దక్కింది.
అక్కడ బీజేపీ నేతలచే
ఓట్ చోరీ జరిగింది
సీఎం సిద్దరామయ్య ఆరోపణలు
కోర్టులో బీజేపీ అభ్యర్థికి
మరోసారి ఊరట


