కెజీఎఫ్: భావి తరాల హితవును దృష్టిలో ఉంచుకుని ప్రకృతిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని 3వ అపర సెషన్స్ న్యాయమూర్తి బి.శివకుమార్ తెలిపారు. గుడ్ డీడ్స్ డే సంధర్భంగా బెళకు ట్రస్టు, తంబార్లహళ్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచి పనులు చేయాలనే సందేశాన్ని ఇవ్వడం ఈ దినం ప్రాముఖ్యత అన్నారు. ప్రకృతి సకల జీవరాశులను తన ఒడిలో ఉంచుకుని కాపాడుతుందని తెలిపారు. అయితే మనిషి తన స్వార్థానికి ప్రకృతిని నాశనం చేస్తున్నాడని పేర్కొన్నారు. అభివృద్ధి, నగరీకరణ పేరుతో ప్రకృతి, పరిసరాలను నాశనం చేయడం సరికాదని పేర్కొన్నారు. అందరూ విధిగా చెట్లను పెంచాలని సూచించారు. కార్యక్రమంలో అపర సివిల్ సీనియర్ న్యాయమూర్తి ముజఫర్ మాంజరి, న్యాయమూర్తి జయలక్ష్మి, సివిల్ న్యాయమూర్తి శమిద, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎస్.ఎన్.రాజగోపాలగౌడ పాల్గొన్నారు.


