హొసపేటె/సాక్షి, బళ్లారి: కానహోసహళ్లి పట్టణంలోని ఉజ్జిని రోడ్డులో కొత్త ఇంటి నిర్మాణం జరుగుతుండగా.. పాత రాతి గోడ ఒకటి కూలిపోయింది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఇంటి యజమాని అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్త ఇంటి పునాది (బేస్మెంట్), పాత గోడ మధ్య పైప్లైన్ వేయడానికి పునాదిని చదును చేసే పనిలో నిమగ్నమైన ఇంటి యజమాని బసవరాజప్ప ఈ ప్రమాదానికి గురయ్యాడు. ఆ గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో అతడి తల పైభాగం తప్ప, మిగిలిన శరీరమంతా మట్టిలో కూరుకుపోయింది. ఫలితంగా ఆయన ప్రాణాలు కోల్పోయాడు. కానహోసహళ్లి పోలీస్ స్టేషన్కు చెందిన పీసీఐ సిద్రమప్ప బిదరాని బృందం వెంటనే ఘటన స్థలానికి చేరుకుంది. స్థానికుల సహకారంతో 45 నిమిషాలకు పైగా శ్రమించి మట్టిలో కూరుకుపోయిన మృతదేహాన్ని వెలికితీశారు. ఈ విషాద ఘటనతో ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి. కానహోసహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
కూడ్లిగి తాలూకా, కనహోసహళ్లిలో ఘటన


