మాలూరు: తాలూకాలోని మాస్తి ఫిర్కా రాజేనహళ్లి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని గొల్లహళ్లి గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటులో రెండు గుంపుల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న తాలూకా యంత్రాంగం అధికారులు, మాస్తి పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. గొల్లహళ్లి గ్రామ సర్వే నంబర్ 4–1లో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు వివాదానికి కారణమైంది. భూమి హక్కు, చట్టపరమైన సంబంధాల విషయమై రెండు గుంపుల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాలూకా అధికారులు, పోలీసులు గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో చర్చించారు. తహసీల్దార్ ఎం.వి.రూప మాట్లాడుతూ.. గ్రామంలో శాంతిభద్రతలను కాపాడటం ముఖ్యమన్నారు. రెండు గుంపుల ప్రముఖులు అన్ని దాఖలాలను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. గ్రామంలో శాంతి సభ నిర్వహించి, అవసరమైతే 144 సెక్షన్ విధించాలని పోలీసులకు సూచించారు.


